పర్వేజ్ ముషారఫ్ మరణానికి సంతాపం తెలుపుతూ శశి థరూర్ ట్వీట్.. మండిపడ్డ బీజేపీ.. ఎందుకంటే ?
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ మరణానికి సంతాపం తెలియజేస్తూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ లో పాక్ వాదం మళ్లీ కనిపించిందని ఆరోపించింది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్లో 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అయితే ఆయన మృతి పట్ల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడింది. పర్వేజ్ ముషారఫ్ మృతి పట్ల శశి థరూర్ సంతాపం వ్యక్తం చేస్తూ శాంతి దూతగా అభివర్ణించారు. ఆయన తెలివైనవాడని, మనోహరమైనవాడని, అతడి ఆలోచనల్లో స్పష్టత ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
“పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అరుదైన వ్యాధితో మరణించారు. అతడు ఒకప్పుడు భారతదేశానికి బద్ధ శత్రువు. కానీ అతడు 2002-2007లో శాంతి కోసం నిజమైన శక్తిగా ఉద్భవించాడు. ఆ రోజుల్లో నేను ప్రతీ సంవత్సరం ఐక్యరాజ్యసమితిలో అతడిని కలిసేవాడిని. నేను అతడి వ్యూహాత్మక ఆలోచనలో తెలివి ఉన్నట్టు స్పష్టంగా గుర్తించాను. ఆర్ఐపీ’’ అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ పై బీజేపీ మండిపడింది. ఆయనను టార్గెట్ చేసింది. ఈ ట్వీట్ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా మాట్లాడుతూ.. శశి థరూర్ ను పాకిస్తాన్ సానుభూతిపరుడని అన్నారు. పర్వేజ్ ముషారఫ్ కార్గిల్ యుద్ధానికి రూపశిల్పి అని, నియంత అని, క్రూరమైన నేరాలకు పాల్పడ్డారని ఆయన ట్వీట్ చేశారు. “తాలిబాన్, ఒసామాలను సోదరులు, హీరోలుగా భావించిన వారిని - చనిపోయిన సొంత సైనికుల మృతదేహాలను తిరిగి తీసుకోవడానికి నిరాకరించిన వారిని కాంగ్రెస్ స్వాగతిస్తోంది! కాంగ్రెస్లో పాక్వాదం మళ్లీ కనిపించింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
త్రిపుర ఎన్నికల పోరు.. హోరెత్తిన ప్రచార జోరు.. రాష్ట్రానికి అగ్రనేతల క్యూ !
మరో ట్వీట్లో “ ఒకప్పుడు ముషారఫ్ రాహుల్ గాంధీని పెద్దమనిషి అని కొనియాడారు. బహుశా కాంగ్రెస్ ముషారఫ్ను ఇష్టపడుతోందా ? ఆర్టికల్ 370 నుంచి సర్జికల్ స్ట్రైక్ వరకు, బాలాకోట్ను అనుమానించిన కాంగ్రెస్ పాక్ లైన్ను ప్రతిధ్వనించింది. ముషారఫ్ను అభినందించింది. కానీ మన సొంత చీఫ్ ను 'సడక్ కా గుండా' అని పిలిచింది. ఇది కాంగ్రెస్!’’ అని ఆయన పేర్కొన్నారు.
త్రిపుర ఎన్నికల పోరు.. హోరెత్తిన ప్రచార జోరు.. రాష్ట్రానికి అగ్రనేతల క్యూ !
పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆగస్టు 11, 1943న బ్రిటిష్ ఇండియాలోని ఢిల్లీలో జన్మించారు. ఆయన ఏప్రిల్ 19, 1961న పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ కాకుల్ నుండి కమిషన్ పొందాడు. 1998లో జనరల్ స్థాయికి పదోన్నతి పొందాడు. పాకిస్తాన్లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎస్)గా బాధ్యతలు స్వీకరించాడు.