పార్టీని సంస్కరించాలి.. మేనిఫెస్టో విడుదల చేసిన శశి థరూర్
శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో లేనని పుకార్లను కొట్టిపారేశారు. తాను పోటీలో ఉన్నానని, వివిధ వర్గాల ప్రజల నుండి మద్దతు లభిస్తున్నదని అన్నారు. మన పార్టీ పని తీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని థరూర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పర్యటించి కార్యకర్తను ఆదుకోవాలని కోరారు. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి థరూర్ తప్పుకోవడంపై పుకార్లు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన యువత, మహిళలు, పార్టీ కార్యకర్తలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించారు.
శశి థరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో లేనని పుకార్లను కొట్టిపారేశారు. తాను పోటీలో ఉన్నానని, వివిధ వర్గాల ప్రజల నుండి మద్దతు లభిస్తున్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా థరూర్ చెన్నైలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన గురువారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీని పునర్నిర్మించడం, దాన్ని మళ్లీ క్రియాశీలం చేయడం, కార్యకర్తలలో నూతన ఉత్తేజం నింపడం వంటి కార్యక్రమాలతో ప్రజలతో టచ్లో ఉండటానికి అధికారాన్ని వికేంద్రీకరించడం తన లక్ష్యం అని అన్నారు. .
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పోరాడేందుకు ఇది రాజకీయంగా కాంగ్రెస్కు బలం చేకూరుస్తుందని తాను నమ్ముతున్నాననీ,. అలాగే పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. ఇదిలా ఉంటే.. మన పార్టీ పని తీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని థరూర్ అన్నారు. యువతను పార్టీలోకి తీసుకోవాలనీ, అదే సమయంలో కష్టపడి పనిచేసే, సుదీర్ఘకాలం పనిచేసిన కార్యకర్తలను గౌరవం ఇవ్వాలని అన్నారు. బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శులను సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.
శశి థరూర్ మ్యానిఫెస్టోలో ముఖ్యాంశాలు
పార్టీకి పునరుజ్జీవం
కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మించేందుకు గ్రామం, బ్లాక్లు, జిల్లాలతో పాటు జాతీయ స్థాయిలో యువతను ముందుకు తీసుకురావాలని మేనిఫెస్టో ద్వారా థరూర్ తెలిపారు. దీంతో పాటు యువత ఆకాంక్షలను అర్థం చేసుకుని.. వారిని ప్రోత్సహించాలని సూచించారు. పార్టీ కార్యకర్తల కృషికి, వారి త్యాగాలకు తగిన ప్రతిఫలం అందించాలని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
వికేంద్రీకరణ
మేనిఫెస్టో ప్రతి స్థాయిలో నాయకత్వ ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. అధికారాన్ని వికేంద్రీకరణ పై దృష్టి పెట్టారు. పార్టీలోని అట్టడుగు స్థాయి ఆఫీస్ బేరర్ల నుంచి ప్రతి ఒక్కరిని గౌరవించాలని, రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ కృషి చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ను మునుపటిలా బలోపేతం చేయడానికి, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ నాయకులకు అధికారాలు అప్పగించాలి, ఇది నాయకుడిని బాధ్యతల నుండి విముక్తి చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.
AICC ప్రధాన కార్యాలయం పాత్రను పునర్నిర్మించడం
వారానికి రెండుసార్లు కార్యకర్తలతో మాట్లాడే పూర్తిస్థాయి అధ్యక్షుడు కాంగ్రెస్కు ఉండాలి. పార్టీకి చెందిన ఏ కార్యకర్త అయినా తన అభిప్రాయాన్ని అధ్యక్షుడి ముందు ఉంచేలా ప్రణాళికలు రూపొందించాలి. ప్రధాన కార్యదర్శులతో పాటు ఇతర ఆఫీస్ బేరర్లకు బాధ్యతలు అప్పగించాలి. రాష్ట్ర స్థాయిలో అధికారులను తగ్గించాలి,
పార్టీ ప్రధాన విశ్వాసాలను పునరుద్ఘాటించడం
కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నుండి మతం, భాష, లింగానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. సుసంపన్నమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవిస్తూనే.. లౌకికవాదం, భారతదేశ వైవిధ్యం, బహుత్వానికి గౌరవం యొక్క సూత్రాలను పునరుద్ఘాటించాలని పేర్కొన్నారు.
పార్టీలో విస్తృత భాగస్వామ్యం
పార్టీలో ఒకరికి ఒక పదవి అనే నిబంధన ఉంటుంది, 50 ఏళ్లలోపు వారికి టిక్కెట్ల కోసం పదవీ పరిమితితో పార్టీ పదవులు, మైనారిటీలతో పాటు మహిళలు, యువకులు, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలు పార్టీ పదవుల్లో నియమిస్తారు.
ఎన్నికల నిర్వహణను బలోపేతం
అభ్యర్థి ఎంపిక కోసం వృత్తిపరమైన సాంకేతికతలను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకే స్థానంలో రెండు ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు పునరావృతం కాలేరు. ఎన్నికల నిర్వహణను మెరుగుపరచడానికి డేటా టెక్నాలజీని ఉపయోగించనున్నారని పేర్కొన్నారు.
యువతపై ఎక్కువ దృష్టి
కాంగ్రెస్ను మళ్లీ గెలిపించేందుకు యువత సమస్యలను దృష్టి సారించాలని పేర్కొన్నారు. వలస యువతతో పాటు నిరుద్యోగ యువత, ప్రత్యేకించి ఐటీ రంగంలో పనిచేస్తున్న యువత సమస్యలను లేవనెత్తారు. దేశ నిర్మాణం కోసం, ఉద్యోగ మేళా, నైపుణ్యం, కొత్త పరిశ్రమలో సహకారంలో కాంగ్రెస్ పెద్ద పాత్ర పోషించవలసి ఉంటుంది.
మహిళలకు ప్రాముఖ్యత
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్ నినాదాన్ని ఇచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, మహిళల నాయకత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, అలాగే.. సమస్యలను లేవనెత్తడానికి మహిళలను ప్రోత్సహిస్తుందని థరూర్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.
ఎన్నికల్లో మహిళలకు పదవులు, సీట్లు కేటాయిస్తారు. దీనికి కాంగ్రెస్ రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
పరిశ్రమ, నిపుణులకు ప్రాధాన్యత
టెక్నాలజీ నిపుణులతో ప్రొఫెషనల్ బాడీలను బలోపేతం చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ దృష్టి సారిస్తుంది. అలాగే ఎంఎస్ఎంఈ రంగాన్ని పునరుద్ధరించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు.
సామాజిక సేవా
కాంగ్రెస్ తిరిగి సామాజిక సేవా దృక్పథానికి రావాల్సిన ఆవశ్యకతపై మేనిఫెస్టో దృష్టి సారించిందని థరూర్ అన్నారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసే యంత్రంగా పార్టీని భావించవద్దని, దానికి కట్టుబడి ప్రజలకు సేవ చేయాలని అన్నారు. మనం ప్రజలతో మమేకమై వారితో కలిసి పని చేయాలని థరూర్ మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.