ఎన్సీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శరద్ పవార్.. అధికారిక ప్రకటన..
మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు.
మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. అయితే తాను రాజకీయాలలో కొనసాగనున్నట్టుగా తెలిపారు. కానీ ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. ఎస్సీపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నానని.. ఇక నుంచి రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో పని చేస్తూనే ఉంటానని శరద్ పవార్ ప్రకటించారు. తన ఆత్మకథ Lok Maze Sangati రెండో ఎడిషన్ ఆవిష్కరణ సందర్భంగా పవార్ ఈ కామెంట్స్ చేశారు.
‘‘రాజ్యసభలో నాకు మూడేళ్ల పదవీకాలం మిగిలి ఉంది. ఇక నుంచి ఎన్నికల్లో పోటీ చేయను. ఈ మూడేళ్లలో రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టి సారిస్తాను. ఎలాంటి అదనపు బాధ్యతలూ తీసుకోను. నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది. మే 1, 1960. నిన్న మే డే జరుపుకున్నాం. ఈ సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత ఎక్కడో ఒక్కచోట ఆగిపోవడం గురించి ఆలోచించాలి. అత్యాశతో ఉండకూడదు. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎప్పుడూ ఒక పదవికి అతుక్కుపోయే స్థితిని తీసుకోను. మీకు ఇది కష్టంగా అనిపించొచ్చు. కానీ నేను ఎన్సీపీ చీఫ్ పదవి నుండి రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను’’ అని శరద్ పవార్ చెప్పారు. శరద్ పవార్ తర్వాత ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు ఎవరూ చేపట్టనున్నారనే దానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
అయితే ఎన్సీపీ చీఫ్గా ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని పవార్ చెప్పారు. ఆ కమిటీలో సుప్రియా సూలే, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, అనిల్ దేశ్ముఖ్, రాజేష్ తోపే, ఛగన్ భుజ్బల్ తదితర సీనియర్ సభ్యులు ఉంటారని తెలిపారు. అయితే శరద్ పవార్ రాజీనామా చేస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే.. అక్కడున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు పవర్ ఆయన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ రాజీనామాను వెనక్కి తీసుకునేవరకు ఇక్కడే ఉంటామని పేర్కొన్నారు.
‘‘నా తోటి సహచరులరా.. అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినప్పటికీ నేను ప్రజా జీవితం నుంచి వైదొలగడండం లేదు. నిరంతర ప్రయాణం నా జీవితంలో అంతర్భాగమైపోయింది. బహిరంగ కార్యక్రమాలు, సమావేశాలకు హాజరవుతూనే ఉంటాను. నేను పూణె, ముంబై, బారామతి, ఢిల్లీ లేదా భారతదేశంలోని మరే ఇతర ప్రాంతంలో ఉన్నా మీ అందరికీ యథావిథిగా అందుబాటులో ఉంటాను’’ అని ఎన్సీపీ కార్యకర్తలతో పవార్ చెప్పారు.