బిహార్ లో కాంగ్రెస్ కి షాక్.. 11మంది ఎమ్మెల్యేలు జంప్?
కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని బుధవారం బాంబు పేల్చారు.
దేశంలో కాంగ్రెస్ పార్టీ చరిష్మా రోజు రోజుకీ తగ్గిపోతోంది. ఒకప్పుడు అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీ జెండాలు ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కనీసం డిపాజిట్లు కూడా రాబట్టలేకపోతోంది. కాగా.. తాజాగా.. బిహార్ లోనూ కాంగ్రెస్ కి ఊహించని షాక్ తగిలేలా కనపడుతోంది. 11మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడే అవకాశం కనపడుతోంది.
దీనికి సంబంధించి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే భరత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని బుధవారం బాంబు పేల్చారు.
‘‘త్వరలోనే పార్టీ చీలిపోనుంది. 11 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు.’’ అని ప్రకటించారు. 19 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందిన వారు కాదని, అయినా ఎన్నికల్లో విజయం సాధించారని ఆయన తెలిపారు.
వీరందరూ పార్టీకి డబ్బులిచ్చి టిక్కెట్లు తెచ్చుకున్నారని, వారంతా ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యారని అన్నారు. రాష్ట్రంలో మరింత బలపడడానికి ఎన్డీయే కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దీనికి అజిత్ శర్మ కూడా సహకరిస్తున్నారని ఆయన అన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలకు పీసీసీ అధ్యక్షుడు మదన్ మోహన్, రాజ్యసభ ఎంపీ అఖిలేశ్ ప్రసాద్, సదానంద సింగ్ సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు.