అందాల తాజ్‌మహాల్ చుట్టూ ఇటీవలి కాలంలో వివాదం రాజుకుంటున్న సంగతి తెలిసిందే. తాజ్ కట్టిన స్థలం తామదేనంటూ జైపూర్ రాజవంశీకురాలు, బీజేపీ ఎంపీ దియా కుమారి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో షాజహాన్ సంతతికి చెందిన ప్రిన్స్ యాకూబ్ స్పందించారు.  

తాజ్‌మహల్ (taj mahal) కట్టిన ఆ భూమి తమదేనంటూ జైపూర్ రాకుమారి (jaipur princes) , బీజేపీ (bjp) ఎంపీ దియా కుమారి (diya kumari) చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అవసరమైతే ఆ భూమికి సంబంధించిన పత్రాలనూ తాను చూపిస్తానని సవాల్ విసిరారు. దియా వ్యాఖ్యలపై తాజాగా షాజహాన్ సంతతి వారసుడు, ప్రిన్స్ యాకూబ్ హబీబుద్దీన్ ట్యూసీ (prince yakub habeebuddin tucy) స్పందించారు. 

ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్‌లో వీడియోను విడుదల చేశారు. ఆమె ఒంట్లో ప్రవహించేది రాజ్‌పుత్‌ల (rajpoot) రక్తమే అయితే.. తాజ్ మహల్ ఉన్న భూమి పత్రాలను చూపించాలని సవాల్ విసిరారు. ఆమెవి పిచ్చి వ్యాఖ్యలని చురకలు వేశారు. షాజహాన్.. రాజ్‌పుత్‌లకు వారి తల్లి తరఫు బంధువే అవుతాడని అన్నారు. అక్బర్ (akbar) భార్య జోధా బాయీ (jodha bai) అలియాస్ హర్కా బాయికి షాజహాన్ (shah jahan) మనవడు అవుతాడని, షాజహాన్ రెండో భార్య లాల్ బాయి రాజ్‌పుత్ అని అన్నారు. 

మొఘలులకు రాజ్‌పుత్‌లు ఆనాడు భూమిని కానుకగా ఇచ్చేవారని యాకూబ్ గుర్తుచేశారు. అందులో భాగంగానే తాజ్‌మహల్ కట్టిన స్థలమూ కానుకగానే వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భూమిని ఆక్రమించారన్న దియాకుమారి వ్యాఖ్యలు నిరాధారమైనవని ఖండించారు. తనకున్న 27 మంది నానమ్మల్లో 14 మంది రాజ్‌పుత్ లేనని యాకూబ్ స్పష్టం చేశారు. అక్బర్ జమానా నుంచి రాజ్‌పుత్‌లు మొఘలులతో సంబంధాలు పెట్టుకున్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటి బంధాలను తెంచే ప్రయత్నం చేయొద్దని దియాకు ఆయన హితవు పలికారు. 

Also Read:తాజ్‌మహల్ నిర్మించింది మా భూమిలోనే.. జైపూర్ రాజవంశీకురాలు దియా కుమారి

కాగా.. అందాల తాజ్‌మహల్ చుట్టూ వివాదం రాజుకుంటున్నది. తాజ్‌మహల్‌లో శాశ్వతంగా మూసి ఉంచిన 22 గదులను తెరిచి అందులో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయో లేదో? చూడాలని అలహాబాద్ హైకోర్టులో (allahabad high court) ఓ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అంతకు ముందే తాజ్‌మహాల్ శివాలయం అని, దాన్ని తేజోమహాలయంగా ప్రకటించాలనే వాదనలు జరిగాయి. అయితే, వీటికి పొడిగింపుగా తాజాగా మరో వ్యాఖ్య ముందుకు వచ్చింది. జైపూర్ రాజవంశానికి చెందిన దియా కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్‌మహల్ అడుగు భూమి తమదేనని అన్నారు.

అలహాబాద్ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌కు మద్దతుగా ఈ బీజేపీ ఎంపీ దియా కుమారి మాట్లాడారు. తాజ్‌మహల్ నిర్మించకముందు అక్కడ ఏమి ఉండేదో దర్యాప్తు చేయాల్సిందేనని వాదించారు. ఈ సమాధి కంటే ముందు అక్కడ ఏమి ఉండేదో తెలుసుకోవాల్సిన హక్కు ప్రజలకు ఉన్నదని వివరించారు. తాజ్‌మహల్ తమ భూమిలోనే నిర్మించారని, ఆ భూమి తమదేనని నిరూపించే డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నాయని తెలిపారు.