ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి, ఏడుగురికి గాయాలు..
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. వివరాలు.. హరిద్వార్ నుంచి లఖింపూర్ ఖేరీకి వెళ్తున్న ట్రక్కు పిలిభిత్లోని గజ్రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో చెట్టును ఢికొట్టడంతో బోల్తాపడింది. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్నవారు హరిద్వార్ నుంచి గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 7 మందికి గాయాలు కాగా.. ఒకరిని బరేలీకి తరలించారు. పిలిభిత్లోని జిల్లా ఆసుపత్రిలో ఆరుగురికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది లఖింపూర్లోని గోలా వాసులుగా తెలుస్తోంది. ఇక, ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని పిలిభిత్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్టుగా పేర్కొన్నారు.