మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేవా-సత్నా సరిహద్దులో రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేవా-సత్నా సరిహద్దులో రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 60 మంది గాయపడ్డారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బర్ఖాడా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బస్సుల్లోని వ్యక్తులు సత్నా నగరంలోని 'కోల్ మహాకుంభ్' నుండి తిరిగి వస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరిందని, 60 మంది గాయపడ్డారని.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అడిషనల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) డాక్టర్ రాజేష్ రాజోరా పిటిఐకి తెలిపారు.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. సిద్ధి, రేవా జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్‌లతో సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని రాజోరా తెలిపారు.గాయపడినవారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారని చెప్పారు. రేవా మెడికల్ కాలేజీ, సిధి జిల్లా ఆసుపత్రిని అప్రమత్తంగా ఉంచాలని సీఎం కోరినట్లు తెలిపారు.

బస్సులను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో బస్సులు బోల్తా పడి కాలువలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మహాకుంభ్‌కు హాజరై తిరిగి వస్తున్న ప్రయాణికులకు ఆహార ప్యాకెట్ల పంపిణీ కోసం బస్సులను మోహనియా సొరంగం సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు.

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి రేవా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను శివరాజ్ సింగ్ చౌహాన్ పరామర్శించారు. అనంతరం శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ.. సిమెంటు లోడ్‌తో కూడిన ట్రక్కు టైర్ పగిలిపోవడంతో రోడ్డు పక్కన ఆగి ఉన్న మూడు బస్సులను ఢీకొట్టిందని చెప్పారు. ఈ సంఘటనను ‘‘చాలా దురదృష్టకరం’’ అని పేర్కొన్న చౌహాన్.. అవసరమైతే, మెరుగైన చికిత్స కోసం బాధితులను ఇక్కడి నుంచి ఎయిర్‌లిఫ్ట్ చేస్తామని చెప్పారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందజేస్తామని కూడా చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయనున్నట్టుగా చెప్పారు. మృతుల కుటుంబీకులకు కూడా పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందజేస్తామని తెలిపారు. ఇక, ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు.