లోక్ సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు విడతల్లో పోలింగ్ జరగ్గా ఈ రోజు(ఆదివారం) చివరి ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 59 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిస్తే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసినట్లే. ఏడో విడతలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, సీని నటుడు శతృఘ్న సిన్హా, మాజీ స్పీకర్ మీరా కుమార్, అనురాగ్ ఠాకూర్, మనోజ్ సిన్హా వంటి ప్రముఖులు ఫోటీ పడుతున్నారు.
సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం
బీహార్-53.03%
హిమాచల్ ప్రదేశ్- 57.43%
మధ్యప్రదేశ్- 59.75%
పంజాబ్- 50.49%
ఉత్తరప్రదేశ్- 47.21%
పశ్చిమ బెంగాల్- 64.87%
జార్ఖండ్- 66.64%
ఛండీగడ్- 51.18%
కోల్కతాలో ఓటేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.క్యాంప్ ఆఫీస్ నుండి నేరుగా పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ఆమె ఓటేశారు. అనంతరం పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న టీఎంసీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలకు అభివాదం చేస్తూ అక్కడినుండి వెళ్లిపోయారు.
పోలీసులపై రాళ్లదాడి... బిహార్ లో హింసాత్మక ఘటన
ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొందరు గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడికి పాల్పడి గాయపర్చిన సంఘటన బిహార్ లో చోటుచేసుకుంది. అర్రా లోని ఓ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో కొందరు చాటుగా దాక్కుని పోలీసులపై రాళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో కొందరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడాలని ప్రయత్నించడమే కాకుండా డ్యూటీలో వున్న పోలీసులపై దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
కోల్కతాలో ఓటేసిన సౌరవ్ గంగూలీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్ కతాలోని బరీషా జనకల్యాణ విద్యాపీఠ్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో గంగూలీ ఓటేశారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ వివరాలు
చివరి దశ ఎన్నికల్లో భాగంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుండి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నిరాష్ట్రాల్లో కలిపి మధ్యాహ్నం మూడు గంటల వరకు 51.95% ఓటింగ్ నమోదయ్యింది.
రాష్ట్రాలవారిగా చూసుకుంటే
బిహార్ - 46.66%
హిమాచల్ ప్రదేశ్ - 49.43%
మధ్య ప్రదేశ్ - 57.27%
పంజాబ్ - 48.18%
ఉత్తర ప్రదేశ్-46.07%
పశ్చిమ బెంగాల్ - 63.58%
జార్ఖండ్ - 64.81%
చత్తీస్ ఘడ్ - 50.24%
పంజాబ్ లో ఇరువర్గాల ఘర్షణ...గాల్లోకి కాల్పులు
పంజాబ్ లో ఓ పోలింగ్ బూత్ వద్ద రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బతిండ నియోజకవర్గ పరిధిలోని తల్వండి సబో లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ నెంబర్ 122 వద్ద ఈ హింస చెలరేగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో మరింత గందరగోళం ఏర్పడింది. అ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మొదటిసారి విడివిడిగా ఓటేసిన అవిభక్త కవలలు
చివకి దశ లోక్ సభ ఎన్నికల్లో బిహార్ కు చెందిన అవిభక్త కవలలు సబా,ఫరా మొదటిసారి వేరువేరుగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పట్నాలోని ఓ పోలింగ్ బూత్ లో ఈ సిస్టర్స్ ఓటేశారు.
పటియాలాలో ఓటేసిన పంజాబ్ ముఖ్యమంత్రి
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ పటియాలాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 89వ పోలింగ్ బూత్ లో ఓటేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పంజాబ్ లో లోక్ సభ ఎన్నికలు గతంలో కంటే ఈసారి ప్రశాంతంగా జరగాయని అన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం వల్లే ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.
మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ శాతం వివరాలు
చివరి దశ ఎన్నికల్లో భాగంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఇవాళ ఉదయం నుండి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నిరాష్ట్రాల్లో కలిపి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 39.85 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
రాష్ట్రాలవారిగా చూసుకుంటే
బిహార్ -36.20%
హిమాచల్ ప్రదేశ్ - 34.47%
మధ్య ప్రదేశ్ -43.89%
పంజాబ్ -36.66%
ఉత్తర ప్రదేశ్-36.37%
పశ్చిమ బెంగాల్ - 47.55%
జార్ఖండ్ -52.89%
చత్తీస్ ఘడ్ -35.60%
ఓటేసిన శత్రుఘన్ సిన్హా
గత ఎన్నికల్లో బిజెపి నుండి పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన స్థానం నుండే ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సీని నటులు శత్రుఘ్న సిన్హా. పాట్నా సాహిబ్ నుండి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పై ఈయన పోటీ చేస్తున్నారు. అయితే ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న పోలింగ్ ఆయన పాల్గొన్నారు. సెయింట్ సెవెరిన్స్ స్కూల్లో ఏర్పాటుచేసిన 339వ నంబర్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటేశారు.
భారత మొదటి ఓటర్ మరోసారి ఓటేశారు (వీడియో)
స్వాతంత్ర్య భారత దేశంలో మొట్టమొదట 1951 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మొదటి ఓటు వినియోగించుకున్న శ్యాంశరన్ నేగీ మరోసారి ఓటేశారు. చివరి విడతలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ కల్ప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 102 ఏళ్ల వయసులోనూ ఆయన ప్రతి ఎన్నికల్లో ఓటేస్తూ మిగతావారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
లాలూ తనయుడిపై దాడి...చంపేదుకు జరిగిన కుట్రేనన్న తేజ్ ప్రతాప్
బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కారుపై ఓ కెమెరా మెన్ దాడికి పాల్పడ్డాడు. పాట్నాలో ఓ పోలింగ్ బూత్ లో ఓటేసి తిరిగి వెళ్లిపోతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుుకుంది. కెమెరా మెన్ దాడిలో కారు అద్దం పగిలిపోయింది. దీంతో తెజ్ ప్రతాప్ పర్సనల్ సెక్యూరిటీ సిబ్బంది సదరు కెమెరా మెన్ ను పట్టకుని చితకబాదారు.
ఈ దాడిపై తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ... తనను చంపడానికే ఈ దాడి జరిగినట్లు అనుమానం వుందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తేజ్ ప్రతాప్ వెల్లడించారు.
బిజెపి అభ్యర్థి కారుపై రాళ్లదాడి
ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల్లో చివరి విడత పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. బెంగాల్ లో మత్రం బిజెపి, టీఎంసి నాయకులు, కార్యకర్తల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా డైమండ్ హర్బర్ లోక్ సభ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి నిలంజన్ రాయ్ కారుపై దాడి జరిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు డొంగారియా ప్రాంతంలో ఆయన కారుపై రాళ్లు రువ్వడంతో స్వల్పంగా ద్వంసమయ్యింది. అయితే ఈ దాడి టీఎంసి అల్లరిమూకల పనేనని నిలంజన్ ఆరోపిస్తున్నారు.
ఓటేసిన సిద్దు దంపతులు
మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ, ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్దులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్ అమృత్ సర్ లోని 134వ బూత్ లో వారు ఓటేశారు.
పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్తత...బిజెపి నేతపై దాడి
పశ్చిమ బెంగాల్ లో చివరి దశ పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చెలరేగుతోంది. టిఎంసి అల్లరిమూకలు తమ పార్టీకి చెందిన ఓ మండలాధ్యక్షుడిపై దాడి చేసినట్లు జాదవ పూర్ బిజెపి అభ్యర్థి అనుపమ్ హజ్ర ఆరోపించారు. అతడి డ్రైవర్ ను కూడా చితకబాది కారును ధ్వంసం చేసినట్లు తెలిపారు.అంతేకాకుండా మరో ముగ్గురు పోలింగ్ ఎంజెంట్స్ ను కూడా వారి దాడి నుండి కాపాడామన్నారు. మొత్తం 52 పోలింగ్ బూతుల్లో టీఎంసీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయని...ప్రజలు బిజెపి ఓటేయాలనుకుంటే వారిన పోలింగ్ బూతుల్లోని వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారిని అనుపమ్ ఆరోపించారు.
పదిగంటల వరకు పోలింగ్ వివరాలు
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో చివరి దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 59 లోక్ సభ నియోజకవర్గాల్లో ఉదయం ప్రారంభమైన పోలింగ్ లో 10 గంటలవరకు 11.75 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
ఇండోర్ లో ఓటేసిన లోక్ సభ స్పీకర్
లోక్ సభ స్పీకర్, బిజెపి నాయకురాలు సుమిత్రా మహజన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్య ప్రదేశ్ ఇండోర్ నగరంలో ఓ పోలింగ్ బూత్ లో ఆమె ఓటేశారు.
బెంగాల్ లో ఓటర్ల నిరసన...
పశ్చిమ బెంగాల్ లోని బసీరత్ ప్రాంతంలోని 189వ పోలింగ్ బూత్ వద్ద కొందరు ఓటర్లు నిరసనకు దిగారు. తమను టీఎంసీ కార్యకర్తలు ఓటేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా ఆడ్డుకుంటున్నారంటూ వారు ఆరోపించారు. దీనిపై బసిరత్ బిజెపి ఎంపీ అభ్యర్థి సయంతన్ బసు మాట్లాడుతూ...దాదాపు వందమంది ఓటర్లను ఇలా ఓటేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. అయితే వారికి తాము అండగా వుండి ఓటు హక్కును వినియోగించుకునేలా చూస్తామన్నారు.
మా పోలింగ్ ఏజెంట్లకు ప్రాణహాని: బిజెపి అభ్యర్థి సికె బోస్
పశ్చిమ బెంగాల్ తృనమూల్ కాంగ్రెస్ నాయకులు మా పోలింగ్ ఏజెంట్లను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బిజెపి ఎంపీ అభ్యర్థి సికె బోస్ ఆరోపించారు. గత రాత్రి నుండి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మా పార్టీ ఏజెంట్లు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పోలింగ్ బూత్ లో మీరు కూర్చుంటే మీ అంతు చూస్తామంటూ టీఎంసీ జిహాదీలు బెదిరిస్తున్నారట. ఈ టీఎంసీ పార్టీకి ఉగ్రవాద సంస్థలకు పెద్ద తేడా లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఓటేసిన మాజీ మంత్రి మనీష్ తివారీ
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకులు మనీశ్ తివారీ లూథియానాలోని సరబా నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్ లోని ఆనంద్ పూర్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆయన ఫోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
పాట్నాలో ఓటేసిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి, బిజెపి నాయకులు రవిశంకర్ ప్రసాద్ పాట్నా లో ఓటేశారు. నగరంలోని ఉమెన్స్ కాలేజీలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ నంబర్ 77 లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాట్నా సాహిబ్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. బిజెపి నుండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సినీనటుడు శత్రుఘ్న సిన్హా పై రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు.
మోదీపై మండిపడ్డ అభిషేక్ బెనర్జీ
పశ్చిమ బెంగాల్ మఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంపీ నేత అభిషేక్ బెనర్జీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సౌత్ కోల్ కతాలోని 208 పోలింగ్ బూతులో ఓటేసిన ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15వ తేదీన మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డైమండ్ హార్బర్ విషయంలో చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. లేకుంటే ఆయన్ని కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.
ఓటేసిన సీకే బోస్
సౌత్ కోల్ కతా బిజెపి ఎంపీ అభ్యర్థి సికె బోస్ ఓటేశారు. నగరంలోని సిటీ కాలేజ్ పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
స్వగ్రామంలో ఓటేసిన హర్భజన్
టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ లోని తన స్వగ్రామంలో ఓటేశారు. జలంధర్ సమీపంలోని గర్హి గ్రామంలో ఆయన క్యూలో నిలబడి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.
ఓటేసిన బిహార్ సీఎం
బిహార్ సీఎం నీతీష్ కుమార్ పాట్నాలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్ భవన్ స్కూల్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ 326 లో ఆయన ఓటేశారు.
ఓటు హక్కును వినియోగించుకున్న యూపి సీఎం
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్ పూర్ లోని పోలింగ్ బూత్ నంబర్ 246 లో ఆయన ఉదయమే ఓటేశారు.
లోక్ సభ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆరు విడతల్లో పోలింగ్ జరగ్గా ఈ రోజు(ఆదివారం) చివరి ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 59 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిస్తే దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసినట్లే. ఏడో విడతలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, సీని నటుడు శతృఘ్న సిన్హా, మాజీ స్పీకర్ మీరా కుమార్, అనురాగ్ ఠాకూర్, మనోజ్ సిన్హా వంటి ప్రముఖులు ఫోటీ పడుతున్నారు.
