ఛత్తీస్ఘడ్ బస్తర్ లో ఘోర ప్రమాదం: సున్నపు రాయి గని కూలి ఏడుగురు మృతి
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. సున్నపురాయి గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ఈ ఘటనలో మరణించారు.
రాయ్పూర్: ఛత్తీస్ఘడ్ లో శుక్రవారంనాడు ఘోర ప్రమాదం జరిగింది. బస్తర్ జిల్లాలో గని కుప్పకూలడంతో ఈ గనిలో సున్నపురాయిని వెలికితీస్తున్న ఏడుగురు కార్మికులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలున్నారు. విషయం తెలిసిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టాయి.ఈ శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారు.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
జగదల్పూర్ కు 12 కిలోమీటర్ల దూరంలోని నగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్గావ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.గనిలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో పైకప్పు కూలడంతో తవ్వకాలు జరుపుతున్నవారు శిథిలాల్లో కూరుకుపోయారు.ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యలను ప్రారంభించారు. సంఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు.