డాక్టర్ హత్య కేసు.. నిందితులకు ఉరిశిక్ష..!
కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది
తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ప్రముఖ నరాల వైద్య నిపుణుడు సుబ్బయ్యను చెన్నైలో కొందరు హతమార్చగా.. ఈ కేసులో ఏడుగురిని ఉరిశిక్ష.. మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షపడిన వారిలో ఓ ప్రొఫెసర్ దంపతులు, వారి కుమారులు కూడా ఉండటం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే... తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లా సామితొప్పనకు చెందిన ప్రభుత్వ వైద్యుడు సుబ్బయ్య 2013 సెప్టెంబర్ 9వ తదేీన దారుణ హత్యకు గురయ్యాడు. అతని క్లినిక్ బయటే ఆయనపై దాడి జరగడం గమనార్హం.
హతుడు సుబ్బయ్య మేనమామ పెరుమాళ్ తన సోదరికి (సుబ్బయ్య తల్లికి) కన్యాకుమారీ జిల్లా అంజుగ్రామంలోని స్థలాన్ని ఇచ్చారు. దీన్ని సమీప బంధువులు ఆక్రమించుకున్నారు. కొన్ని కోట్లు విలువచేసే ఈ స్థలాన్ని దక్కించుకోవాలని ఇరువర్గాలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాయి. స్థల వివాదం మూడు తరాలుగా నడుస్తూ తీవ్రస్థాయికి చేరుకుంది. 2013లో ఉద్యోగవిరమణ పొందిన డాక్టర్ సుబ్బయ్య న్యాయస్థానం ద్వారా బంధువులపై పోరాడి ఆ స్థలాన్ని దక్కించుకున్నాడు. ఇందుకు కక్షకట్టిన బంధువులు కిరాయి గూండాల సహకారంతో చెన్నైలోని క్లినిక్ వద్ద డాక్టర్ సుబ్బయ్యను దారుణంగా హత్యచేశారు.
ఈ కేసులో మేనమామ రెండో భార్య కుమారుడైన ప్రొఫెసర్ పొన్నుస్వామి, అతని భార్య ప్రొఫెసర్ మేరీ పుష్పం, వీరి కుమారులైన న్యాయవాది ఫాసిల్, ఇంజినీర్ బోరిస్తోపాటూ న్యాయవాది విల్సన్, ప్రభుత్వ డాక్టర్ జేమ్స్ సతీష్కుమార్, కబడ్డీ క్రీడాకారుడు ఏసురాజన్, మురుగన్, సెల్వప్రకాష్, అయ్యప్పన్.. ఈ పదిమందిని నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణ సమయంలో అయ్యప్పన్ అప్రూవర్గా మారిపోయాడు. మొత్తం పది మంది నిందితుల్లో 9 మంది దోషులని నిర్ధారణైనట్లు చెన్నై సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
ఆ 9మంది దోషుల్లో ఏడుగురికి ఉరిశిక్ష ఖరారు చేయగా.. మరో ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.