ఒకే బైక్ పై ఏడుగురి ప్రయాణం.. ఆ కుటుంబ సభ్యుల వీడియోపై నెట్టింట్లో రచ్చ.. (వీడియో)
ఓ వైరల్ వీడియోలో ఒకే బైక్ పై ఏడుగురు కూర్చుని ప్రయాణం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అని మాట్లాడుతుంటే.. మరికొందరు ప్రజా రవాణా సేవలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఇంకొందరు చమురు ధరలు ఆకాశాన్ని అంటాయని తెలిపారు.
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఏ వీడియో కొంత ఆసక్తిగా కనిపించినా వెంటనే వైరల్ అయిపోతుంది. వేలాది మంది చూసేస్తుంటారు. తమ కామెంట్లను జోడిస్తూ మరింత పాపులర్ చేస్తుంటారు. కొన్నిసార్లు జోకులు పేల్చే వీడియోలు ఉంటే.. మరికొన్ని సీరియస్ విషయాలనూ, పరిస్థితులను వెల్లడిస్తూ ఉంటాయి. కానీ, తాజాగా, వైరల్ అవుతున్న ఓ వీడియోపై నెటిజన్లు తెగ చర్చ చేస్తున్నారు. కొందరు సీరియస్గా తీసుకుని సదరు బైక్ రైడర్పై యాక్షన్ తీసుకోవాలని చెబుతుంటే.. మరికొందరు వారి దుస్థితి అలాంటిది.. వారి ఆర్థిక స్థితి వారిని సఫర్ చేసేలాగే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.
ఓ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ ట్విట్టర్ హ్యాండిల్ ఆసక్తికర లేదా ప్రమాదకరమైనా వీడియోను పోస్టు చేశారు. మాటలు రావడం లేదంటూ ఆమె ఈ వీడియో పోస్టు చేశారు. అందులో ఓ వ్యక్తి టూ వీలర్ పై కూర్చుని ఉన్నారు. ఆయన ముందు పెట్రోల్ ట్యాంక్ పై ఒక చిన్నారి కూర్చుని ఉన్నది. ఆ తర్వాత మరో చిన్నారిని ఆ రైడర్ ముందు కూర్చోబెట్టారు. ఆయన వెనుక బైక్ సీట్ పై ఉన్న కొంచెం స్థలంలోనే మిగిలిన ఇద్దరు మహిళలు.. ఇద్దరు పిల్లలను ఒడిలో పెట్టుకుని కూర్చున్నారు.
అటుగా రోడ్డు పై వస్తున్న పెద్ద వాహనాలు పోయేంత వరకు ఆ వ్యక్తి బైక్ ఆపాడు. ఆ తర్వాత రైడ్ చేశాడు. దీని పై చాలా మంది నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అని, ఇలా చట్టాన్ని అతిక్రమించి ఏ ప్రమాదం జరిగినా పిల్లలను పొట్టనబెట్టుకున్నవారు అవుతారని ఆగ్రహించారు. అందుకే ఆ రైడర్ ను లేదా బైక్ ఓనర్ను అరెస్టు చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని ఓ నెటిజన్ డిమాండ్ చేశాడు.
మరో యూజర్.. అసలు ముందు ట్రాఫిక్ పోలీసు లేడని అర్థం అవుతున్నదని కామెంట్ చేశాడు.ఎందుకంటే వీరికి ఎదురుగా వస్తున్న ఓ బైక్ పై ముగ్గురు వ్యక్తులు హాయిగా వెళ్లిపోతున్న ఫొటోను ఆ వీడియోను గ్రాబ్ చేశాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆ ట్రిపుల్ రైడింగ్ను పేర్కొంటూ పోలీసు ఎదురుగా లేడని నిర్దారించేశాడు.
కాగా, దేశంలో చమురు ధరలు భారీగా పెరిగాయని, అణగారిన వర్గాలు వాటిని కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేరని సమర్థించుకువచ్చారు.