ఇష్టమొచ్చినట్లు వ్యాక్సినేషన్కు అనుమతిస్తారా.. ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు: సీరం
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనేది చూసుకోకుండానే వివిధ వయసుల వారికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించడంపై సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇచ్చింది
వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనేది చూసుకోకుండానే వివిధ వయసుల వారికి ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించడంపై సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇచ్చింది. అది కంపెనీ అభిప్రాయం ఏమాత్రం కాదని స్పష్టం చేసింది.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ అభిప్రాయానికి సీరమ్ ఇన్స్టిట్యూట్కు దూరంగా ఉంటోందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్యశాఖకు ఆ కంపెనీ డైరెక్టర్ ప్రకాశ్కుమార్ సింగ్ లేఖ రాశారు. కంపెనీ సీఈవో అదర్ పూనావాలా తరఫున లేఖ రాస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనాపై ప్రభుత్వం చేస్తున్న పోరులో భాగంగా కొవిషీల్డ్ ఉత్పత్తిని భారీగా పెంచేందుకు సీరం సంస్థ కట్టుబడి ఉందని వెల్లడించారు. పూనావాలా మాత్రమే కంపెనీ అధికార ప్రతినిధి అని స్పష్టం చేశారు.
Also Read:భారత్లో వ్యాక్సినేషన్... 2, 3 నెలల్లో కష్టమే, మూడేళ్లు పక్కా : పూనావాలా సంచలన వ్యాఖ్యలు
దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు మే 1 నుంచి కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి 18 ఏళ్లు పైబడిన వారికి చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. పైగా 45 ఏళ్లు నిండిన వారికి రెండో డోసు వేయడానికే ఆయా రాష్ట్రాలు తలలు పట్టుకుంటున్నాయి.
నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరతను దృష్టిలో ఉంచుకుని సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ల స్టాక్ను గానీ, డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలను గానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యాక్సినేషన్ ప్రారంభించిందన్నారు. ఈ నేపథ్యంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ వివరణ ఇచ్చింది.