ఉత్తరప్రదేశ్ సీనియర్ బీజేపీ నేత హరద్వార్ దూబే అస్వస్థతతో కన్నుమూశారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
ఢిల్లీ : ఉత్తరప్రదేశ్ కు చెందిన బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు హరద్వార్ దూబే (73) అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. సోమవారం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. దీంతో దేశ రాజకీయాల్లో మరో విషాద ఘటన చోటు చేసుకున్నట్టయింది. సోమవారం మధ్యాహ్నం దూబే పార్థివ దేహాన్ని ఆగ్రాకు తీసుకురానున్నారు.
కొద్దిరోజులుగా హరద్వార్ దూబే ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం నాడు దూబే కుమారుడు ప్రన్షు దూబే మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, క్షేమంగా ఉన్నారని ఓ ప్రకటన చేశారు. అయితే, సోమవారం తెల్లవారు జామున గుండెనొప్పి రావడంతో… కాసేపటికే అయన మృతి చెందినట్లుగా తెలిపారు.
గోమాంసం స్మగ్లింగ్ చేస్తున్నాడని ముస్లిం వ్యక్తిపై గోసంరక్షకుల బృందం దాడి.. మృతి...
హరద్వార్ దూబే మృతికి పలువురు బిజెపి నేతలు సంతాపం వ్యక్తం చేశారు. హరద్వార్ దూబే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రమంత్రిగా కూడా సేవలందించారు. 2020లో రాజ్యసభ సభ్యుడిగా అయ్యారు. ఉత్తరప్రదేశ్ లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
హరద్వార్ దూబేకు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు ప్రన్షు దూబే, కోడలు ఊర్వశి. కూతురు డాక్టర్ కృత్యా దూబే. ఇక హరద్వార్ దూబే సోదరుడు కూడా బిజెపి సీనియర్ నేతనే. ఆయన పేరు గామా దూబే.
