కార్యకర్త.. పేకాట... అర్ధరాత్రి 2 గంటలు: చేజేతులా వివాదంలో ఇరుక్కున్న బీజేపీ నేత
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. కార్యకర్తల సమావేశంలో వారిని ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. కార్యకర్తల సమావేశంలో వారిని ఉత్సాహపరచడానికి చేసిన వ్యాఖ్యలతో ఇరకాటంలో పడ్డారు.
ఈ సమావేశంలో కైలాష్ మాట్లాడుతూ... ఓ రోజు రాత్రి 2 గంటలకు మన కార్యకర్త నుంచి ఫోన్ వచ్చింది. పేకాట ఆడుతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు.. నన్ను విడిపించండి అని విజ్ఞప్తి చేశాడు.
దీంతో వెంటనే ఆ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి అతనిని విడిపించాను.. బీజేపీ ఎప్పుడూ కార్యకర్తల వెన్నంటే ఉంటుంది’’ అని విజయ వర్గియా స్పష్టం చేశాడు. ఆ మాటలతో అక్కడున్న కార్యకర్తలు జోష్తో ఈలలు, చప్పట్లతో హల్చల్ చేశారు.
అయితే ఆ తర్వాతే అసలు సినిమా మొదలయ్యింది. కైలాష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త నరేంద్ర సలూజా ట్వీట్టర్లో పోస్ట్ చేస్తూ.. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై విరుచుకుపడ్డారు.
‘ఇదేనా బీజేపీ విధానం..? ఇలాంటి ఆలోచనలతోనే మీరు నవభారత్ను నిర్మించేది అంటూ నిలదీశారు. బాధ్యతగల మీ నాయకులు పేకాట ఆడి అరెస్టయిన కార్యకర్తను విడిపించాడు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు... సమాజానికి మీరు ఎలాంటి సందేశాన్ని ఇద్దామనుకున్నారని నరేంద్ర మండిపడ్డారు. కేవలం ప్రతిపక్షాలే కాకుండా సొంత పార్టీ నేతల నుంచి కూడా కైలాష్పై వ్యతిరేకత వస్తోంది. ఇదే సమయంలో నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు.