సారాంశం

కర్తవ్య మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా వుండాలని ‘‘సెంగోల్’’ గుర్తుచేస్తూనే వుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.  ఈ సెంగోల్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్‌లో వాకింగ్ స్టిక్‌గా ప్రదర్శనలో ఉంచబడిందని కాంగ్రెస్‌కు చురకలంటించారు. 

కర్తవ్య మార్గంలో నడవాలని, ప్రజలకు జవాబుదారీగా వుండాలని ‘‘సెంగోల్’’ గుర్తుచేస్తూనే వుంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో తమిళనాడు నుంచి వచ్చిన ఆధీనం మఠాధిపతులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ‘‘సెంగోల్’’ను అందించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. సెంగోల్ కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించబడటం తనకు ఎంతో సంతోషంగా వుందన్నారు. 

1947లో సెంగోల్ కేవలం అధికార బదిలీకి చిహ్నాంగానే మారలేదని, వలసరాజ్యానికి పూర్వమే నాటి అద్భుతమైన భారతదేశాన్ని దాని భవిష్యత్తుతో అనుసంధానం చేసిందని మోడీ పేర్కొన్నారు. ఆధీనం మఠాధిపతులు ఈరోజు తన నివాసానికి రావడం తన అదృష్టమన్నారు. శివుని ఆశీర్వాదం వల్లనే తాను శివభక్తులను దర్శించుకోగలిగానని మోడీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సెంగోల్‌కు తగిన గౌరవం కల్పించలేదని కాంగ్రెస్‌పై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: కొత్త పార్లమెంట్ భవనం : మోడీకి ‘‘సెంగోల్’’ను అందజేసిన తమిళనాడు ఆధీనం మఠాధిపతులు, వీడియో

గొప్ప చరిత్ర కలిగిన పవిత్ర సెంగోల్‌కు స్వాతంత్య్రానంతరం తగిన గౌరవం లభించి, గౌరవప్రదమైన స్థానం కల్పించి ఉంటే బాగుండేదని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఈ సెంగోల్ ప్రయాగ్‌రాజ్‌లోని ఆనంద్ భవన్‌లో వాకింగ్ స్టిక్‌గా ప్రదర్శనలో ఉంచబడిందని కాంగ్రెస్‌కు చురకలంటించారు. ఇప్పుడు మీ సేవకుడు , అతని ప్రభుత్వం ఆనంద్ భవన్ నుంచి సెంగోల్‌ను బయటకు తీసుకొచ్చిందని మోడీ పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్‌ను ఏర్పాటు చేసినప్పుడు, తాము స్వాతంత్య్రం పొందిన నాటి అద్భుతమైన క్షణాలను తిరిగి అనుభూతి చెందుతామని ప్రధాని అన్నారు. 

ఇదే సమయంలో భారత స్వాతంత్య్ర పోరాటంలో తమిళనాడు పాత్రను ప్రధాని గుర్తుచేశారు. తమిళనాడు ఎంతో మంది గొప్ప నాయకులను దేశానికి అందించిందని, భారత జాతీయ వాదానికి కేంద్రంగా వుందని పేర్కొన్నారు. కానీ ఇంత జరిగినా.. తమిళుల రచనలు పూర్తిగా గుర్తించబడకపోవడం దురదృష్టకరమని మోడీ వ్యాఖ్యానించారు. కానీ బీజేపీ ప్రభుత్వం.. తమిళులు చేసిన సేవలను గుర్తించడం, ప్రశంసించడం ప్రారంభించిందన్నారు.