థాయ్ స్మైల్ ఎయిర్వేస్ లో ప్రయాణీకుల మధ్య కొట్లాట... నివేదిక కోరిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ..
గత నాలుగు రోజుల క్రితం థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో కొంతమంది ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం లోపల జరిగిన గొడవకు సంబంధించిన వీడియో క్లిప్ బుధవారం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.
థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బ్యాంకాక్ నుంచి కోల్కతా వెళ్తున్న థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. విమానంలోనే ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిని చెంపదెబ్బలు కొట్టాడు. దాడి చేస్తున్న ప్రయాణికులను శాంతించి నిశ్శబ్దంగా కూర్చోవాలని విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ లు ప్రయత్నించినా..ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో దాడి చేస్తున్న వ్యక్తి స్నేహితులు వచ్చి ఘర్షణకు ఆపకుండా.. దాడిని మరింత తీవ్రం చేశారు. అనంతరం కొంతమంది ఫ్లైట్ అటెండెంట్లు, తోటి ప్రయాణికులు దాడిని అడ్డుకున్నారు.
విమానంలో జరిగిన దాడిని ఓ ప్రయాణికుడు వీడియోను రికార్డు చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో అదికాస్తా వైరల్ గా మారింది. ఈ వీడియో క్లిప్లో.. ఇద్దరు ప్రయాణికులు వాదించుకోవడం చూడవచ్చు. వారిలో ఒకరు, నిశ్శబ్దంగా కూర్చోండి అని అంటుండగా, మరొకరు మీ చేతులను కిందకు దించండి అని చెబుతారు, ఆపై కొన్ని సెకన్లలో మాటల వాగ్వివాదం.. మరొకరు దూకుడుగా వ్యవహరించడంతో ఘర్షణగా మారింది. ఈ గొడవలో మరికొందరు ప్రయాణికులు కూడా పాల్గొన్నారు. థాయ్ స్మైల్ ఎయిర్వేస్ ఈ విషయంపై స్పందించలేదు.
ఇదిలాఉంటే.. ఈ ఘటనపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డీజీ జుల్ఫికర్ హసన్ స్పందించారు. థాయ్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల మధ్య గొడవ జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోను తాము గుర్తించామని చెప్పారు. ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను కోరినట్టు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే.. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా కూడా స్పందించారు. ఆయన ఈ ఘటనపై ట్వీట్ చేస్తూ.. "థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల మధ్య గొడవకు పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు." అని స్పష్టం చేశారు.
ఇండిగో విమానంలో వివాదం.. వీడియో వైరల్..
ఈ నెల ప్రారంభంలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది, డిసెంబర్ 16 న ఇస్తాంబుల్ నుండి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు, ఫ్లైట్ అటెండెంట్ మధ్య తీవ్రమైన వాదన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వైరల్ వీడియోపై జనాలు ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో.. కొంతమంది వినియోగదారులు వ్యాఖ్యలలో వివిధ విషయాలు చెప్పారు,
మరికొందరు క్యాబిన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కామెంట్స్ చేశారు. ఈ సంఘటనపై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందిస్తూ.. "మేము ఈ సంఘటనను పరిశీలిస్తున్నామని, కస్టమర్ సౌలభ్యం ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత అని హామీ ఇవ్వాలనుకుంటున్నాము" అని తెలిపింది. ఆహారం ఎంపికపై తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిపై విచారణ జరుపుతున్నామని డీజీసీఏ తెలిపింది.