దారుణం: నరబలికి సొంతకూతుర్ని సిద్దం చేసిన తల్లిదండ్రులు
మరికొద్దిరోజుల్లో చంద్రుడిపై భారత్ రెండోసారి అడుగుపెట్టబోతోంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. ఇలాంటి రోజుల్లో కూడా భారతదేశంలో క్షుద్రపూజలు, మూఢనమ్మకాలను ఇంకా నమ్మడం ఆశ్చర్యకరం. మంత్రగాళ్ల మాయలో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.
మరికొద్దిరోజుల్లో చంద్రుడిపై భారత్ రెండోసారి అడుగుపెట్టబోతోంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం దూసుకెళ్తోంది. ఇలాంటి రోజుల్లో కూడా భారతదేశంలో క్షుద్రపూజలు, మూఢనమ్మకాలను ఇంకా నమ్మడం ఆశ్చర్యకరం. మంత్రగాళ్ల మాయలో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు.
ఇందులో నిరక్ష్యరాస్యులతో పాటు ఉన్నత విద్యావంతులున్నారు. తాజాగా నరబలి కోసం సొంత కుటుంబానికి చెందిన ఓ మూడేళ్ల చిన్నారిని బలివ్వడానికి సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. అసోంలోని ఉదాల్గుడి జిల్లా గనక్పారా గ్రామంలోని ఓ ఉపాధ్యాయుడి కుటుంబంలో మూడేళ్ల క్రితం ఓ చిన్నారి చనిపోయింది.
దీంతో వారు మనశ్శాంతి కోసం ఓ పూజారిని సంప్రదించారు. అప్పటి నుంచి ఇంట్లో పూజలు చేస్తున్న ఆయన తాజాగా ఓ చిన్నారిని బలివ్వాలని చెప్పాడట. దీంతో ఇంట్లో వారంతా కలిసి ఆ ఉపాధ్యాయుడి దగ్గరి బంధువు కూతుర్ని బలివ్వాలని నిర్ణయించారు.
దీనికి ఆ చిన్నారి తల్లిదండ్రులు సైతం అంగీకరించారు. శనివారం పూజకు ఏర్పాట్లు చేసిన ఉపాధ్యాయుడి కుటుంబసభ్యులు.. మంత్రగాడిని పిలిపించారు. అయితే ఇంట్లో నుంచి మంత్రాలు, పొగ విపరీతంగా రావడంతో స్థానికులు వెళ్లి గమనించి... బలిని అడ్డుకున్నారు.
పాపను చంపొద్దని స్థానికులు ఎంత వారించినా.. వారు వినిపించుకోలేదు. ఈ తతంగాన్ని అడ్డుకుంటే చంపేస్తామంటూ ఆ క్షుద్రపూజారి బెదిరించాడు. దీంతో చేసేది లేదక స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వారు ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. పోలీసుల రాకను పసిగట్టిన ఉపాధ్యాయ కుటుంబం సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో చేసేది లేక పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
వెంటనే ఇంట్లోకి వెళ్లిన పోలీసులు పూజారిని, ఉపాధ్యాయ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఈ క్షుద్రపూజ జరిపించిన వ్యక్తి సైన్స్ టీచర్గా పనిచేస్తుండగా.. ఆయన భార్య నర్సుగా పనిచేస్తుండటం గమనార్హం.