కరోనాతో మరణించిన బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలి: కేంద్రానికి సుప్రీం ఆదేశం
కరోనాతో మరణించిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది.ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందించాలని కోరింది.
న్యూఢిల్లీ; కరోనాతో మరణించిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం నాడు ఆదేశించింది.ఈ విషయమై మార్గదర్శకాలను రూపొందించాలని కోరింది.కరోనా మృతులకు పరిహారం చెల్లింపు విషయమై బుధవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. మార్గదర్శకాల రూపకల్పన కోసం ఆరువారాల గడువును విధించింది ఉన్నత న్యాయస్థానం.కరోనాతో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి రూ. 4 లక్షలు చెల్లించలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు గతంలో చెప్పింది.
కరోనా బాధిత కుటుంబాలకు ఉపశమనం కల్గించేలా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ని కనీస ప్రమాణాలు రూపొందించాలని ఆదేశించింది కోర్టు. కనీస ప్రమాణాలు రూపొందించే విషయంలో ఎన్డీఎంఏ వైఫల్యం చెందిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.కరోనాతో మరణించిన వారికి వెంటనే ధృవపత్రాలను అందించాలని ప్రభుత్వానికి సూచించింది. సర్టిఫికెట్లలో తేదీలు, కారణాలు నమోదు చేయాలని కోరింది. కరోనా బాధితులకు పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు నిర్వహణ నిధులన్నీ ఖర్చు చేయాల్సి వస్తోందని కేంద్రం గతంలో సుప్రీం దృష్టికి తీసుకెళ్లింది.