Maharashtra political crisis: మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే.. 100 సీట్లు గెలుస్తాం: సంజయ్ రౌత్
Maharashtra political crisis: శివ సేన రెబల్స్ తిరుగుబాటు తర్వాత.. బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా షిండే అధికారం చేపట్టారు. అయితే.. శివ సేన మాత్రం నైతిక విజయం తామే సాధించమనీ, ఇప్పడికిప్పుడూ ఎన్నికలు నిర్వహించినా.. తాము 100 సీట్లు గెలుస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు.
Maharashtra political crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. శివ సేన రెబల్స్ తిరుగుబాటు తరువాత అఘాడీ ప్రభుత్వం పడిపోయింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయినా.. శివసేన మాత్రం నైతిక విజయమదేననీ , ఎన్నికల్లో తేల్చుకుంటామని సవాల్ విసురుతున్నారు. శివసేన నాయకుల్లో ఏమాత్రం ఆశలు సన్నగిల్లడం లేదు. ఈ తరుణంలో శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే.. తాము కనీసం 100 సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉందని రౌత్ ప్రకటించారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తే.. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారుఝ అన్నీ తేలిపోతాయని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన.. తమ ఓటర్లు తమకు దూరంగా కాలేదని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల మీద ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని పేర్కొన్నారు.
అసలు శివసేన అని షిండే వర్గమేననే వాదనపై రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే మరెవరికీ చెందరని, డబ్బు ఆధారంగా ఈ పేరును పట్టుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను, డబ్బును అడ్డం పెట్టుకుని విజయం సాధించారని, శివసేనను హస్తగతం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుగుబాటుదారులకు డబ్బు ఇవ్వడమే కాకుండా.. ఇంకేదో కూడా ఇచ్చారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారని రౌత్ అన్నారు. అది ఎప్పుడైతే బయటపెడితే.. అప్పుడు అసలు విషయం బట్టబయలు అవుతుందనీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్వంత పార్టీకి తిరిగి వస్తారని.. తాము ఇంకా ఆశిస్తున్నామని శివసేన నాయకుడు రౌత్ అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాం.. వాళ్ళు మన వాళ్ళు, తిరిగి వస్తారు. 'ఉదయం మతిమరుపు సాయంత్రానికి ఇంటికి వస్తే మరిచిపోయానని అనరు.'
దర్యాప్తు సంస్థ, డబ్బుతో ప్రభుత్వాన్ని హైజాక్ చేయలేరని రౌత్ అన్నారు. షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై ఆయన మాట్లాడుతూ.. షిండే శిబిరం నోటీసు ఇవ్వాలనుకుంటే.. వారిని అనుమతించమని అన్నారు. శివసేనకు పూర్తి విశ్వాసం ఉందనీ, మధ్యంతర ఎన్నికలు జరిగితే 100 సీట్లు గెలుస్తామని తెలిపారు.
విశ్వాస పరీక్షలో షిండే విజయం
ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం జులై 4న మహారాష్ట్ర శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. షిండే కు మొత్తం 164 ఓట్లు రాగా, అఘాడీకి 99 ఓట్లు వచ్చాయి. అంతకు ముందు స్పీకర్ ఎన్నికలోనూ బీజేపీకి చెందిన రాహుల్ నర్వేకర్ విజయం సాధించారు.