సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స
ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య విషమించింది. ప్రస్తుతం ఆయనకు మేదాంత హాస్పిటల్ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ చాన్నాళ్ల కిందే అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. ఆయన గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇంటర్నల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుశీల కటారియా సూపర్విజన్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
82 ఏళ్ల యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కొన్ని రోజుల క్రితమే మేదాంత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కానీ, ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత దిగజారడంతో ఐసీయూలోకి షిప్ట్ చేశారు.
ఆయన ఒంట్లో నలతగా ఉన్నదని జులై 2021న ఈ హాస్పిటల్లో ములాయం సింగ్ యాదవ్ను అడ్మిట్ చేశారు.
తన తండ్రి ఆరోగ్యం బాగాలేదనే వార్త విన్న తర్వాత యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ లక్నో నుంచి ఢిల్లీకి బయల్దేరారు. శివపాల్ సింగ్ యాదవ్ కూడా హాస్పిటల్కు బయల్దేరారు.
ములాయం సింగ్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీని వ్యవస్థాపించారు. ఆయన ప్రస్తుతం మెయిన్పురి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ట్వీట్ కూడా చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్టు మీడియా ద్వారా తనకు సమాచారం అందిందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు కేశవ్ ప్రసాద్ మౌర్య ట్వీట్టర్లో పేర్కొన్నారు.