తరచుగా మాతో సాహిల్ గురించి ప్రస్తావించేది, ముందు చదువుకోమని చెప్పాం.. సాక్షి తండ్రి
ఢిల్లీలో రెండు రోజుల క్రితం వెలుగు చూసిన టీనేజ్ అమ్మాయి హత్య కేసులో ఆమె తండ్రి పోలీసలకు తెలిపిన విషయాలు సంచలనంగా మారాయి.
ఢిల్లీ : ఢిల్లీలోని రోహిణిలోని షహబాద్ డైరీ ప్రాంతంలో 20 ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల అమ్మాయిని 21 సార్లు కత్తితో పొడిచి, రాయితో విచక్షణారహితంగా మోది చంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితురాలైన సాక్షి తండ్రి తన కుమార్తె, నిందితుడి మధ్య సంబంధం గురించి తెలిపాడు. తన కూతురు సాక్షికి, నిందితుడు సాహిల్ కు గత యేడాదిగా పరిచయం ఉందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నాడు.
అంతేకాదు.. "నా కుమార్తె తరచుగా మా ముందు సాహిల్ గురించి ప్రస్తావించేది. కానీ ఆమె ఇంకా తన వయసు చాలా చిన్నదని.. ఇలాంటి ప్రేమలు లాంటివి కాకుండా.. ముందు చదువు మీద దృష్టి పెట్టాలని మేము చెప్పాం. ఈ వయసులో ప్రేమకాదు.. చదువు ముఖ్యం అని మేము ఆమెకు వివరించడానికి ప్రయత్నించినప్పుడల్లా, ఆమె కోపం తెచ్చుకుని తన స్నేహితురాలు నీతు వద్దకు వెళ్లేది”అని బాధితురాలి తండ్రి చెప్పారు.
సాక్షి గత 10 రోజులుగా నీతూతో కలిసి ఉంటుందని ఆయన తెలిపారు. “ఆ దారుణఘటన జరిగిన రోజు రాత్రి నేను ఇంట్లో ఉన్నాను, సాక్షి స్నేహితురాలు నీతు వచ్చి, సాహిల్ అనే యువకుడు సాక్షిపై కత్తి, రాళ్లతో దాడి చేశాడని చెప్పింది” అన్నాడు. హత్యకు ఒకరోజు ముందు సాక్షితో సాహిల్ వాగ్వాదానికి దిగాడని సాక్షి తండ్రి తన ఎఫ్ఐఆర్లో పోలీసులకు తెలిపారు.
బ్యూటీపార్లర్ కని వెళ్లి వధువు జంప్.. మండపంలోని వరుడికి బిగ్ షాక్...ఎక్కడంటే...
"నేను నీతూతో కలిసి బి బ్లాక్ షహబాద్ డెయిరీకి చేరుకున్నప్పుడు, అక్కడ నా కుమార్తె సాక్షి తలకు గాయాలతో చనిపోయి పడి ఉండడం గుర్తించాను" అని బాధితురాలి తండ్రి ఎఫ్ఐఆర్లో తెలిపారు. కూతురు మృతిని తట్టుకోలేక తీవ్ర వేదనలో ఉన్న ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
పదహారేళ్ల సాక్షిని సాహిల్ అనే వ్యక్తి 21 కత్తిపోట్లు పొడిచాడు. దాడి ఎంత భయంకరంగా ఉందంటే.., హత్యాయుధమైన కత్తి.. ఒకానొక సమయంలో ఆమె తలలో ఇరుక్కుపోయింది. కొన్ని క్షణాల తరువాత, హంతకుడు సమీపంలో పడి ఉన్న ఒక బండరాయిని తీసుకొని ఆమెను కొట్టడం ప్రారంభించాడు. ఆ సమయంలో ప్రజలు అటుగా వెళుతున్నప్పటికీ, ఎవరూ జోక్యం చేసుకోవడానికి లేదా దాడిని ఆపడానికి ప్రయత్నించకపోవడంతో అతను ఆమెను బండరాయితో ఐదుసార్లు మోదాడు.
ఢిల్లీలోని రోహిణిలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో ఉన్న ఒక లేన్లోని సీసీటీవీ కెమెరాలో చిక్కిన దృశ్యాలివి. దారుణమైన నేరం చేసిన కొన్ని గంటల తర్వాత సాహిల్ అనే నిందితుడిని ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో అరెస్టు చేశారు. 20 ఏళ్ల సాహిల్ ఫ్రిజ్-ఏసీ రిపేరింగ్ మెకానిక్. ఈ దాడిలో బాలిక పుర్రె పగిలిందని పోస్ట్మార్టం నివేదికలో ప్రాథమికంగా తేలింది. పోస్టుమార్టం నివేదిక నుంచి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీలో 20 ఏళ్ల సాహిల్ మైనర్ బాలికను చంపిన అదే వీధిలో క్రైం సీన్ ను బుధవారం ఢిల్లీ పోలీసులు రీక్రియేట్ చేశారు. పదహారేళ్ల సాక్షిని 20 సార్లు కత్తితో పొడిచి, ఆపై సిమెంట్ స్లాబ్తో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె శరీరంపై 34 గాయాల గుర్తులు ఉన్నాయని, ఆమె పుర్రె పగులగొట్టాడని గుర్తించారు.