మోర్బీ ఘటన విషయంలో ప్రధాని మోదీపై విమర్శలు.. జైపూర్లో టీఎంసీ అధికార ప్రతినిధి అరెస్ట్..
గుజరాత్లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తూ.. ట్వీట్ చేసిన తమ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారని తృణమూల్ కాంగ్రెస్ పేర్కొంది.
గుజరాత్లోని మోర్బీ వంతెన ఘటనపై ట్వీట్ చేసిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి, మమతా బెనర్జీకి సన్నిహితుడైన సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని సోమవారం అర్థరాత్రి రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మోర్బీ ఘటనపై ప్రధాని మోదీ టార్గెట్ చేస్తూ.. తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన అరెస్టు విషయాన్ని పార్టీ సహచరుడు, రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలేను గుజరాత్ పోలీసులు జైపూర్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారని ఓబ్రెయిన్ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
సాకేత్ సోమవారం రాత్రి 9 గంటలకు న్యూఢిల్లీ నుంచి జైపూర్కు విమానంలో బయలుదేరాడు. ఆ సమయంలో గుజరాత్ పోలీసులు జైపూర్ విమానాశ్రయంలో అతని కోసం వేచి..అరెస్టు చేశారు. దీనిని " కక్ష్య పూరితంగా పెట్టిన కేసు"గా పేర్కొంటూ.. మోర్బి వంతెన కూలిపోవడంపై సాకేత్ గోఖలే చేసిన ట్వీట్పై అహ్మదాబాద్ సైబర్ సెల్లో కేసు నమోదు చేసినట్లు TMC MP డెరెక్ ఓబ్రెయిన్ తెలిపారు. బీజేపీ రాజకీయ ప్రతీకారం మరో సారి తీవ్ర స్థాయికి చేరిందని ఓ'బ్రియన్ అన్నారు.
తల్లితో మాట్లాడిన గోఖలే ఫోన్
ఓబ్రెయిన్ తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన తర్వాత మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు గోఖలే తన తల్లికి ఫోన్ చేసి గుజరాత్ పోలీసులు తనను అహ్మదాబాద్ తీసుకువెళ్తున్నారని, ఈ రోజు మధ్యాహ్నానికి అహ్మదాబాద్ చేరుకుంటానని చెప్పాడు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే .. ఫోన్ చేయడానికి అనుమతించిన పోలీసులు అతని ఫోన్తో పాటు అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
మోర్బీ ఘటన విషయంలో ప్రధాని మోదీపై విమర్శలు
బ్రిడ్జి కూలిన ఘటన తర్వాత ప్రధాని మోడీ బాధితులను పరమర్శించడానికి గుజరాత్లోని మోర్బీలో పర్యటించారు. ఈ పర్యటనకు (కేవలం కొన్ని గంటలకే) రూ.30 కోట్లు ఖర్చు చేశారని TMC అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే పేర్కొన్నారు. రిసెప్షన్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫోటోగ్రఫీకి రూ. 5.5 కోట్లు మాత్రమేనని గోఖలే పేర్కొన్నాడు. మోదీ ఈవెంట్ మేనేజ్మెంట్, పీఆర్లకు 135 మంది ప్రాణాల కంటే ఎక్కువ ఖర్చయిందని ఆయన పేర్కొన్నారు. ఎందుకంటే ఈ దుర్ఘటనలో చనిపోయిన 135 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు మాత్రమే ఎక్స్ గ్రేషియా అందించారని విమర్శించారు.
గుజరాత్ బీజేపీ తప్పుడు వార్తలు
గోఖలే ట్వీట్పై ఇచ్చిన సమాచారాన్ని ఫేక్ న్యూస్ అని గుజరాత్ బీజేపీ పేర్కొంది. అలాంటి ఆర్టీఐ దాఖలు చేయలేదని లేదా ఏ ఆర్టీఐకి అలాంటి సమాధానం ఇవ్వలేదని గుజరాత్ బీజేపీ పేర్కొంది. కొత్త క్లిప్పింగ్ కల్పితమని, వాస్తవానికి అలాంటి నివేదిక ఎక్కడా ప్రచురించబడలేదని బీజేపీ గుజరాత్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అక్టోబర్లో మోర్బీ నగరంలోని వంతెన కూలిపోవడంతో 55 మంది చిన్నారులు సహా మొత్తం 135 మంది మరణించిన విషయం తెలిసిందే.