శబరిమల వివాదం.. ఇంటికి చేరిన కనకదుర్గ
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కనకదుర్గ ఇంటికి చేరింది.
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న కనకదుర్గ ఇంటికి చేరింది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ.. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత తొలిసారిగా బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్న సంగతి తెలిసిందే.
కాగా...అయ్యప్పను దర్శించుకుందన్న కారణంతో కనదుర్గపై సొంత అత్త దాడి చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం మళ్లీ ఇంటికి వెళ్లగా.. ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో తన ఇంట్లోకి తాను వెళ్లేందుకు సహకరించాలంటూ ఆమె కోర్టును కూడా ఆశ్రయించింది. కాగా.. కోర్టు ఉత్తర్వులతో ఆమె మలప్పురం జిల్లా ఆంగడిప్పురంలోని తన భర్త ఇంటిలో అడుగుపెట్టింది.
అయితే.. అప్పటికే ఆమె భర్త తన ఇద్దరు బిడ్డలను తీసుకొని వేరే ప్రాంతానికి దూరంగా వెళ్లడం గమనార్హం. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ.. కోర్టు సహాయంతో తన ఇంట్లో తాను అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు తన బిడ్డలను తాను చూడకపోయినా.. తర్వాత చూడగలననే నమ్మకం వెల్లబుచ్చారు.