ఆపరేషన్ గంగాలో భాగంగా భారత్ ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను తరలిస్తోంది. అయితే మానవతా దృక్పథంతో నిస్సహాయ స్థితిలో ఉన్న ఇతర దేశాల స్టూడెంట్లకు కూడా చేయుతనందిస్తోంది. వారిని కూడా ఇండియన్ స్డూడెంట్లతో పాటు తరలిస్తోంది. ఈ క్రమంలో ఖార్కివ్ నుంచి ఓ పాక్ స్టూడెంట్ ను తరలించింది. దీంతో ఆమె ప్రధాని మోడీకి, ఇండియన్ ఎంబసీకి థ్యాంక్స్ చెప్పింది.
రష్యా (Russia) ఉక్రెయిన్ (Ukraine)పై దాడి చేయడం ప్రారంభించిన నాటి నుంచి అనేక మంది సాధారణ పౌరులు, విదేశీయులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు. సుమీ (sumy), ఖార్కీవ్ (kharkiv), కైవ్ (kyiv)తో పాటు ఉక్రెయిన్ లోని ఇతర ముఖ్య నగరాల్లో ఎంతో మంది విదేశీ పౌరులు చిక్కుకుపోయారు. ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. చుట్టు పక్కల బాంబుల వర్షం కురుస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక జీవిస్తున్నారు. అయితే వారిని తలించేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. మన దేశం కూడా ఆపరేషన్ గంగా (operation ganga)పేరిట ప్రత్యేకంగా మిషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను చాలా వేగంగా ఇండియా (india)కు తీసుకొస్తోంది.
ఆపరేషన్ గంగాలో భాగంగా భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకురావడమే కాకుండా.. మానవతా దృక్పథంతో పలు దేశాల విద్యార్థులను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయం చేస్తోంది. ఈ క్రమంలోనే పలువురు నేపాలి (nepali) స్టూడెంట్లను, పాకిస్తానీ (pakistani) స్టూడెంట్లకు ఇప్పటికే సహాయం చేసింది. అయితే నిన్న ఖార్కివ్ నుంచి ఇండియన్ స్టూడెంట్లను తరలించే ప్రక్రియ భారత్ చేపట్టింది. ఇందులో ఓ పాకిస్తాన్ స్టూడెంట్ అయిన అస్మా షఫీక్ ను కూడా తరలించింది. ఆమె ఖార్కివ్ నుంచి ఇండియన్ స్డూడెంట్స్ తో పాటుగా ఉక్రెయిన్ పశ్చిమ సరిహద్దుకు చేరుకుంటున్నారు.
ఖార్కివ్ నుంచి తరలించినందుకు అస్మా షఫీక్ (Asma Shafique) ఇండియన్ ఎంబసీకి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి (prime minister of india narendra modi) ఆమె ధన్యవాదాలు తెలిపారు. “ నన్ను ఖాళీ చేయించినందుకు కైవ్లోని భారత రాయబార కార్యాలయానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నేను నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు మద్దతు తెలిపినందుకు చాలా థ్యాంక్స్” అని ఆమె ANI తో తెలిపారు. త్వరలోనే అస్మా షఫీక్ తన కుటుంబ సభ్యులతో కలిసిపోనుంది.
కాగా సోమవారం పాకిస్తాన్ కు చెందిన మరో విద్యార్థి మిషా అర్షద్ (Misha Arshad) పాక్ ఎంబసీ (pak embassy)ని తీవ్రంగా నిందించింది. ఖార్కివ్ నుంచి పాకిస్తానీ విద్యార్థులను తరలించడానికి వారు ఏమీ చేయలేదని ఆరోపించింది. ‘‘ మేము పాకిస్తాన్ భవిష్యత్తు. కానీ ఈ క్లిష్ట సమయంలో వారు మాతో ఇలా వ్యవహరించారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ అపార్ట్మెంట్లలో నివసించే వారిని హాస్టల్ బేస్మెంట్లకు మార్చింది. నేను నైజీరియా, చైనా, ఇండియా, కొంతమంది స్థానిక ఉక్రేనియన్లతో మొత్తం 120 మంది స్టూడెంట్లతో కలిసి ఉన్నాను.” అని అర్షద్ పేర్కొన్నట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. అయితే అనంతరం ఆమె ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో టెర్నోపిల్ నగరానికి బయలుదేరింది. మొత్తం భారతీయ విద్యార్థులతో ఉన్న బస్సుల్లో తాను మాత్రమే పాకిస్తానీని అని తెలిపారు.
నేపాల్ (Nepal)కు చెందిన మరో స్టూడెంట్ రోషన్ ఝా (Roshan Jha)ను కూడా ఇండియన్ ఎంబసీ (Indian embassy) తరలించింది.‘‘ ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన పౌరులను ఆదుకోవడానికి నేపాల్ ఏమీ చేయలేదు ’’ అని ఆయన ది ఖాట్మండు పోస్ట్ (The Kathmandu Post)తో వెల్లడించారు. తనకు చాలా మంది భారతీయ స్నేహితులు ఉన్నారని, వారు తనకు చాలా సహాయం చేశారని ఝా చెప్పారు. ఆపరేషన్ గంగా గురించి తెలిసినప్పుడు తాను ఇండియన్ ఎంబసీని కలిసి, తనను కూడా తరలించాలని అభ్యర్థించానని చెప్పారు. తనును తరలించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలని తెలిపారు. కాగా భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుండి ఖాళీ చేయించిన మొదటి నేపాలీ ఝా. ఇప్పటి వరకు దాదాపు 18 వేల మంది భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా ప్రభుత్వం ఇండియాకు తీసుకువచ్చింది.
