రష్యా అధ్యక్షుడు పుతిన్ కు యుద్ధం ఆపాలని ఎలా ఆదేశాలు ఇవ్వగలనని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వీ రమణ అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ పౌరులను కాపాడాలనే పిటిషన్ పై విచారణ సందర్భంగా, సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి వస్తున్న పోస్ట్ ల నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా (Russia) దాడి కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రెండు వైపులా ఎంతో ప్రాణ నష్టం జరుగుతోంది. ఉక్రెయిన్ లో చాలా మంది పౌరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. మన దేశ విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఇంకా ఉక్రెయిన్ లోనే చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
అయితే ఈ క్రమంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను రక్షించాలని సుప్రీంకోర్టు (supreme court)లో పిటిషన్ దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (NV Ramana) బుధవారం విచారించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఆయనపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్ట్ లను ప్రస్తావించారు. ‘‘ నేను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను చూశాను. ఆ వీడియోల్లో నేను (సీజేఐ) ఏం చేస్తున్నారని అంటున్నారు. అయితే యుద్ధాన్ని ఆపాలని నేను రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఆదేశాలు ఇవ్వగలనా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన 200 మందికి పైగా భారతీయ విద్యార్థులను రక్షించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ రొమానియా నుంచి కాకుండా పోలాండ్, హంగేరి నుంచి విమానాలు నడుస్తున్నాయి. చాలా మంది బాలికలతో సహా విద్యార్థులు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇరుక్కుపోయారు ’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయమూర్తిలు ఎఎస్ బోపన్న(A S Bopanna), హిమా కోహ్లీ(Hima Kohli)లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.
పిటిషన్ వాదనకు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ వారి పట్ల మా అందరికీ సానుభూతి ఉంది. అయితే కోర్టు ఏం చేయగలదు ’’ అని పేర్కొంది. న్యాయవాది సమర్పణను బెంచ్ గమనించింది. రొమేనియా సరిహద్దు సమీపంలో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులను తరలించడంలో సహాయం చేయడానికి అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ (Attorney General K K Venugopal)ను ఆయన కార్యాలయాన్నిఉపయోగించాలని కోరింది.
వైమానిక దళంలో రోపింగ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులను యుద్ధ ప్రాంతం నుండి తరలించే ప్రయత్నాలను వేగవంతం చేసింది. రష్యా ఉక్రేనియన్ నగరాలపై బాంబు దాడి చేస్తున్న నేపథ్యంలో ఖార్కివ్ నుంచి నడుచుకుంటూ అయినా సమీపంలోని మూడు ప్రదేశాలకు అత్యవసరంగా బయలుదేరాలని భారతీయులను కోరింది.
అయితే చాలా మంది విద్యార్థులు తమని ఉక్రెయిన్ అధికారులు తన్నారని, బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరం నుంచి వెళ్లే రైళ్లల్లో ఎక్కనివ్వలేదని ఫిర్యాదు చేశారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన మూడు ప్రాంతాలకు వెళ్లాలంటే 11 నుంచి 16 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.
ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచినట్లు ఈరోజు తెల్లవారుజామున వచ్చిన వార్తలను భారత ప్రభుత్వం ఖండించింది. ‘‘ ఏ విద్యార్థిని బందించినట్టు మాకు నివేదికలు అందలేదు. ఖార్కివ్, పొరుగు ప్రాంతాల నుంచి విద్యార్థులను దేశం పశ్చిమ భాగానికి తీసుకెళ్లడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని మేము ఉక్రెయిన్ అధికారులను అభ్యర్థించాము.’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా రష్యా ఆధీనంలో ఉన్న తూర్పు ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్లో ఉక్రేనియన్ దళాలు పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచుతున్నాయని రష్యా ప్రభుత్వం పేర్కొంది. దీంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ స్పష్టతను ఇచ్చింది.
ఉక్రెయిన్లో దాదాపు 8,000 మంది భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు ఇంకా చిక్కుకుపోయారని విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా మంగళవారం తెలిపారు. రష్యా సైనిక దాడి కారణంగా ఉక్రెయిన్ గగనతలం ఫిబ్రవరి 24 నుండి మూసివేశారు. దీంతో ఉక్రెయిన్ పశ్చిమ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలాండ్ నుంచి భారతదేశం ప్రత్యేక విమానాల ద్వారా పౌరులను తీసుకొస్తోంది. నలుగురు కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, వికె సింగ్ ఉక్రెయిన్ పొరుగు దేశాలలో తరలింపు ప్రయత్నాలను సమన్వయం చేస్తున్నారు.
