మహారాష్ట్ర అసెంబ్లీలో గందరగోళం: 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాది పాటు సస్పెన్షన్
మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు తాత్కాలిక స్పీకర్.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు తాత్కాలిక స్పీకర్.స్పీకర్ స్థానంలోత ఉన్న భాస్కర్ జాదవ్ ను దూషించారనే నెపంతో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటేశారు.స్పీకర్ ను దూషించినందుకు 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
సంజయ్ కుటే, ఆశిష్ సెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహజన్, అతుల్ భత్కల్, పరాగ్ అల్వానీ, హరీష్ పింపాలే, రామ్ సతుపుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే , కృతికుమార్ బంగడియాలను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.సభ వాయిదా పడిన తర్వాత తన చాంబర్ లో ఉన్న సమయంలో విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు తనను దూషించారని స్పీకర్ చెప్పారు. ఈ విషయమై విచారణ జరపాలని పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రిని స్పీకర్ భాస్కర్ జాదవ్ కోరారు. స్పీకర్ తీరును విపక్ష పార్టీ బీజేపీ తప్పుబట్టింది.
తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడానికి అధికారపక్షం కట్టుకథన అల్లిందని విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు స్పీకర్ కు క్షమాపణ చెప్పారన్నారు.స్పీకర్ తో తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకొందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఓబీసీ సమస్యపై మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం నాడు గందరగోళం చోటు చేసుకొంది. ఈ విషయమై మాట్లాడేందుకు విపక్షాలకు సమయం కేటాయించలేదు. దీంతో వివాదం చోటు చేసుకొంది. స్పీకర్ ఛాంబర్ లో శివసేన ఎమ్మెల్యేలు అసభ్యకరమైన భాషను ఉపయోగించారని సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే ఆశిష్ షెలార్ చెప్పారు. తాలిబాన్లను సిగ్గుపడేలా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు.