సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదు: శబరిమల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్
శబరిమల ఆలయం పరిసర ప్రాంతాల్లో దసరా పర్వదినాన కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమల ఆలయంలోకి మహిళా భక్తులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు బీజేపీ, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి.
శబరిమల: శబరిమల ఆలయం పరిసర ప్రాంతాల్లో దసరా పర్వదినాన కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమల ఆలయంలోకి మహిళా భక్తులను అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ సంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ కు బీజేపీ, శివసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి.
బంద్ నేపథ్యంలో కేరళలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కర్ణాటక, తమిళనాడు బస్సులను రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపివేశారు. హిందూ సంఘాల బంద్ పిలుపుతో కేరళ అంతా స్థంభించిపోయింది. దుకాణాలు స్వచ్చంధంగా మూసివేశారు వ్యాపారస్థులు.
సుప్రీంకోర్టు తీర్పు, శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనలపై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. సమాజం, మహిళలు అంగీకరించి ఎంతోకాలంగా పాటిస్తున్న సంప్రదాయాలను సుప్రీంకోర్టు పట్టించుకోకుండానే తీర్పు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శబరిమలలోకి మహిళలను అనుమతించే విషయంలో మతపెద్దల అభిప్రాయాలను, కోట్లాదిమంది భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకోవాలని అయితే ఆ దిశగా సుప్రీంకోర్టు ప్రయత్నించలేదని తెలిపారు. శబరిమల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవాల్సిన అవసరం లేదని మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలని, అందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.