రూ.50 కోట్లిస్తే మోడీని చంపుతా: మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్
రూ. 50 కోట్లిస్తే తాను ప్రధానమంత్రిని హత్య చేస్తానని బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన వ్యాఖ్యానించినట్టుగా ఓ వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు.
న్యూఢిల్లీ: రూ. 50 కోట్లిస్తే తాను ప్రధానమంత్రిని హత్య చేస్తానని బీఎస్ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన వ్యాఖ్యానించినట్టుగా ఓ వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు.
సోమవారం నాడు బీజేపీ నేతలు ఈ వీడియోను మీడియాకు విడుదల చేశారు. వారణాసి ఎంపీ స్థానం నుండి ఎస్పీ అభ్యర్ధిగా తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని తానేనని ఆయన ఒప్పుకొన్నాడు. కానీ, ప్రధానమంత్రిని రూ. 50 కోట్లిస్తే చంపుతానని తాను ఏనాడూ అనలేదన్నారు. ఈ వీడియోను 2017లో న్యూఢిల్లీలో తాను ధర్నా చేసే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ చిత్రీకరించాడన్నారు. తనను బీఎస్ఎఫ్ నుండి డిస్మిస్ చేసిన సమయంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.
ఆ సమయంలో తాను అనేక సమస్యల గురించి మాట్లాడినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, ఏనాడూ కూడ ప్రధానిని హత్య చేస్తానని చెప్పలేదన్నారు.
ఈ వీడియోను చిత్రీకరించిన కానిస్టేబుల్ తనను రెండు వారాల క్రితం కలిసినట్టుగా చెప్పారు.
ఆర్థిక అవకతవకలకు పాల్పడే ఓ వ్యవహారంలో తనతో కలిసి పనిచేయాలని కోరితే తాను తిరస్కరించినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో తన వీడియోను చూపి ఈ వీడియోను సర్కులేట్ చేస్తానని బెదిరించాడని తేజ్ బహదూర్ చెప్పారు. అంతేకాదు తనను రూ. 50 లక్షలు ఇవ్వాలని కూడ డిమాండ్ చేశాడని ఆయన చెప్పారు.