ఎన్టీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ది హత్యే: పోస్టుమార్టం నివేదిక
మాజీ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ ది సహజ మరణం కాదని,అతడిని హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక తేల్చినట్టుగా పోలీసులు చెప్పారు.
న్యూఢిల్లీ: మాజీ ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ ది సహజ మరణం కాదని,అతడిని హత్య చేశారని పోస్టుమార్టం నివేదిక తేల్చినట్టుగా పోలీసులు చెప్పారు.
శేఖర్ తివారీని దిండుతో ముఖంపై అదిమి ఊపిరాడకుండా చంపారని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ఆధారంగా తేలిందని పోలీసులు చెప్పారు.ఈ నెల 17వ తేదీన రోహిత్ శేఖర్ మరణించాడు. గుండెపోటు కారణంగా రొోహిత్ శేఖర్ మరణించినట్టుగా భావించారు. కానీ, పోస్టు మార్టం నివేదిక కారణంగా రోహిత్ను హత్య చేసినట్టుగా తేలిందని పోలీసులు తెలిపారు.
రోహిత్ శేఖర్ను హత్య చేసినట్టుగా తేలడంతో ఈ కేసును పోలిసులు క్రైం బ్రాంచ్కు బదిలీ చేశారు. రోహిత్ శేఖర్ది హత్య అని తేలడంతో పోలీసులు ఇవాళ ఆయన ఇంటిని సందర్శించారు.
రోహిత్ శేఖర్ కుటుంబసభ్యులను. ఆ ఇంట్లో పనిచేసే వారిని పోలీసులు ప్రశ్నించారు. రోహిత్ శేఖర్ భార్య అపూర్వ ప్రస్తుతం ఢిల్లీలో లేదు. ఫోరెన్సిక్ టీమ్ కూడ ఈ ఇంటిని సందర్శించింది.
రోహిత్ ఇంట్లో ఏడు సీసీ కెమెరాలున్నాయి. ఇందులో రెండు సీసీ కెమెరాలు పనిచేయని విషయాన్ని పోలీసులు గుర్తించారు. తివారీ ఈ నెల 12వ తేదీన ఓటు హక్కును వినియోగించుకొనేందుకు గాను ఉత్తరాఖండ్కు వెళ్లి ఈ నెల 15వ తేదీన వచ్చారు.
ఈ నెల 16వ తేదీన రోహిత్ శేఖర్ తల్లి చికిత్స కోసం మాక్స్ ఆసుపత్రికి వెళ్లింది. అదే సమయంలో రోహిత్ శేఖర్కు ఆరోగ్యం బాగా లేదని ముక్కు నుండి రక్తం కారుతోందని ఆమెకు ఫోన్ వచ్చింది. అతడిని ఆసుపత్రికి తరలించే లోపుగానే ఆయన మృత్యువాత పడ్డారు.
రోహిత్ శేఖర్ తన తండ్రి ఎన్డీ తివారీ అంటూ సుదీర్ఘ కాలం పాటు పోరాటం చేశాడు. 2012లో ఎన్డీ తివారీ డీఎన్ఏ పరీక్షల కోసం తన రక్త నమూనాలు ఇవ్వడానికి నిరాకరించాడు. ఆ తర్వాత ఇచ్చాడు.2014లో ఢిల్లీ హైకోర్టు శేఖర్ తండ్రి ఎన్డీ తివారీ అంటూ తీర్పు చెప్పింది. ఆ తర్వాత తివారీ కూడ ఆయనను తన కొడుకుగా ఒప్పుకొన్నాడు.