పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవ‌లే నియ‌మితుడైన నవజ్యోత్‌ సింగ్ సిద్ధూ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురవ్వడంతో ముగ్గురు మరణించారు. 

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్ జోత్ సింగ్ సిద్ధూ ప్రమాణ స్వీకారం వేళ అపశృతి చోటు చేసుకుంది. ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మినీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మోగా జిల్లాలోని లొహారా వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు దుర్మరణం పాలవ్వగా... పది మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చండీగఢ్ లో జరుగుతున్న సిద్ధూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్తున్నామంటూ వారు చెప్పారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన వారంతా ఎమ్మెల్యే కుల్బీర్ సింగ్ జీరా అనుచరులని తెలుస్తోంది. మోగాకు 15 కిలోమీటర్ల దూరంలోని జీరా నుంచి వారు చండీగఢ్‌కు బయల్దేరారని చెబుతున్నారు.

ప్రమాద ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని మోగా జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక పంపాలని సూచించారు