ఆర్జేడీ చీఫ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను ఐదో దాణా కేసులో దోసిగా తేల్చింది కోర్టు.      

న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి Lalu Prasad Yadav ను ఐదో దాణా కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఈ కేసు తీర్పు చదివే సమయానికి లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టు రూమ్ లోనే ఉన్నారు. Doranda ట్రెజరీ నుండి రూ. 139.35 కోట్లను అక్రంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది. ఈ విషయమై ఇవాళ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది.

లాలాూ ప్రసాద్ యాదవ్ పై నమోదైన ఐదు Fodder కేసుల్లో కూడా ఆయనను దోషిగా కోర్టు తేల్చింది. మంగళవారం నాడు ఈ కేసు తీర్పును న్యాయమూర్తి సికె శశి చదివే సమయంలో లాలూ ప్రసాద్ కోర్టు హాల్‌లోనే ఉన్నారు. ఇప్పటికే నాలుగు పశు దాణా కుంభకోణం కేసుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా కోర్టులు తేల్చాయి. చైబాసా ట్రెజరీ నుండి విడతల వారీగా రూ.37.7 కోట్లు, రూ.33.13కోట్లు డియోఘర్ ట్రెజరీ నుండి రూ. 89.27 కోట్లు, రూ.3.76 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేశారని కోర్టు నిర్ధారించింది.

2018లో దుమ్కా కేసులో దోషిగా తేలినందుకు ఆయనపై రూ. 90 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది.గతంలోని నాలుగు కేసులపై వచ్చిన తీర్పులను కూడా లాలూ ప్రసాద్ యాదవ్ సవాల్ చేశారు. ఈ తీర్పును కూడా సవాల్ చేసే అవకాశం ఉంది. ఈ ఐదు కేసులు కూడా పశువుల దాణా కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను స్వాహా చేసిన కేసులే కావడం గమనార్హం.

 2017 డిసెంబర్ నుండి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లోనే ఉన్నాడు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ జార్ఖండ్ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోనే ఎక్కువకాలం శిక్షను అనుభవించాడు. గత ఏడాది జనవరి మాసంలలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఢిల్లీకి తీసుకొచ్చారు.ఈ కేసులో మూడేళ్లకు పైగా శిక్ష పడితే లాలూ ప్రసాద్ యాదవ్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

లాలూ ప్రసాద్ యాదవ్ సహా 99 మంది నిందితులపై సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే శశి గత ఏడాది ఫిబ్రవరి నుండి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో చివరి నిందితుడు డాక్టర్ శైలేంద్ర కుమార్ తరపున వాదనలు ఈ ఏడాది జనవరి 29న పూర్తయ్యాయి. తీర్పు వెలువడే రోజున నిందితులను కోర్టుకు రావాలని జడ్జి ఆదేశించారు. ఈ కేసులో 170 మంది నిందితుల్లో 55 మంది నిందితులు ఇప్పటికే మరనించారు. ఏడుగురు ప్రభుత్వ సాక్షులుగా మారారు. ఇద్దరు తమపై వచ్చిన అభియోగాలను అంగీకరించారు. ఆరుగురు ఇంకా పరారీలోనే ఉన్నారు. లాలూతో పాటు మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పీఏసీ ఛైర్మెన్ ధ్రువ్ భగత్, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ కేఎం ప్రసాద్ ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. 

లాలూ ప్రసాద్ జైల్లో ఉన్న సమయంలో Tejashwi Yadav పార్టీ కార్యకలాపాలను సాగిస్తున్నాడు. 2020లో బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఆర్జేడీ కూటమి తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. లాలూ ప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం 2020లోనే ప్రథమంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.