పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం.. ఆగస్టు 28న ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చిన కాంగ్రెస్
Chalo Dilli: దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో దృష్టి సారించడం లేదంటూ కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 28న ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చింది.
Chalo Dilli-Congress rally: దేశ రాజధానిలోని రాంలీలా మైదాన్లో ఆగస్టు 28న ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ 'మెహంగై పర్ హల్లా బోల్' ర్యాలీ నిర్వహించనుంది. రానున్న వారాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగంపై వరుస నిరసనలతో కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తుందని పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 ఆగస్టు 17 నుండి 23 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మండీలు, రిటైల్ మార్కెట్లు, ఇతర ప్రదేశాలలో కాంగ్రెస్ పార్టీ 'మెహంగై చౌపాల్' ఇంటరాక్టివ్ సమావేశాలను నిర్వహిస్తుంది. అలాగే, ఆగస్టు 28న 'మెహంగై పర్ హల్లా బోల్' ర్యాలీతో ముగుస్తుంది. న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో ఏకకాలంలో 'మెహంగై పర్ హల్లా బోల్ - చలో డిల్లీ' కార్యక్రమాలను నిర్వహిస్తాయి” అని జైరాం రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో మోడీ ప్రభుత్వ "ప్రజావ్యతిరేక విధానాలకు" వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆగస్టు 5 న దేశవ్యాప్త ఆందోళనను నిర్వహించింది. ఆ పార్టీ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నదని తెలిపారు. "ప్రధాని నరేంద్ర మోడీ చట్టబద్ధమైన నిరసనను 'బ్లాక్ మ్యాజిక్'గా మార్చడానికి చేసిన నిర్విరామ ప్రయత్నం, విపరీతమైన ద్రవ్యోల్బణం-నిరుద్యోగాన్ని నియంత్రించడంలో విఫలమైన బీజేపీ ప్రభుత్వ అభద్రతాభావాన్ని మాత్రమే హైలైట్ చేస్తుంది" అని జై రాం రమేష్ అన్నారు. మోడీ ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం వల్ల భారత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. పెరుగు, మజ్జిగ, ప్యాకేజ్డ్ ఫుడ్గ్రెయిన్స్ వంటి నిత్యావసర వస్తువులపై అధిక పన్నులతో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని, ప్రభుత్వ ఆస్తులను క్రోనీ క్యాపిటలిస్టులకు బదిలీ చేయడం, తప్పుదారి పట్టించిన అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఉపాధి పరిస్థితి మరింత దిగజారిందని జైరాం రమేష్ అన్నారు. "భారత జాతీయ కాంగ్రెస్ ఈ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజల్లో అవగాహనను పెంచుతూనే ఉంటుంది. మార్గాన్ని మార్చుకునేలా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది" అని ఆయన అన్నారు.
ఇదిలావుండగా, 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా పై ప్రసంశలతో పాటు.. విమర్శలు కూడా వస్తున్నాయి. త్రివర్ణ పతాకం పేరుతో పేదలకు రేషన్ ఇవ్వడానికి బదులు బీజేపీ ప్రభుత్వం జాతీయ జెండాపై, పేదల ఆత్మగౌరవంపై దాడి చేస్తోందని రాహుల్ గాంధీ బుధవారం ఆరోపించారు. త్రివర్ణ పతాకం గర్వకారణం, అది ప్రతి హృదయంలో ఉంటుంది. జాతీయవాదాన్ని ఎప్పటికీ అమ్ముకోలేమని, రేషన్ ఇవ్వకుండా త్రివర్ణ పతాకం పేరుతో పేదల నుంచి 20 రూపాయలు దండుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం త్రివర్ణ పతాకంతో పాటు దేశంలోని పేదల ఆత్మగౌరవంపై దాడి చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.