రోడ్డు ప్రమాదం: తీవ్రంగా గాయపడిన క్రికెటర్ రిషబ్ పంత్, దగ్ధమైన కారు
ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు
న్యూఢిల్లీ: ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం నాడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.ఉత్తరాఖండ్ నుండి ఢిల్లీకి వెళ్లున్న సమయంలో రిషబ్ పంత్ ప్రయాణీస్తున్న కారు రూర్కీ వద్ద డివైడర్ ను డీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. తొలుత రిషబ్ పంత్ ను రూర్కీలోని సక్షమ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అతడిని డెహ్రడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం 5:15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో రిషబ్ పంత్ ఒక్కడే ఉన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ ఆశోక్ కుమార్ చెప్పారు. డివైడర్ ను ఢీకొని మంటలు వ్యాపించడంతో కారు నేుండి బయట పడేందుకు కారు అద్దాలను పగులగొట్టారని డీజీపీ చెప్పారు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తల, మోకాలు, భుజాలకు గాయాలైనట్టుగా డీజీపీ చెప్పారు. పంత్ కాలు కూడా ఫ్రాక్చర్ అయి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ జరిగిన టెస్ట్ సీరీస్ ను ఇండియా గెలుచుకుంది. బంగాదేశ్ తో ఇండియా ఆడిన జట్టులో రిషబ్ పంత్ సభ్యుడిగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ మంచి పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
శ్రీలంకతో జరిగే టీ20 సీరీస్ కు రిషబ్ పంత్ ను తప్పించారు. దుబాయ్ లో భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనితో కలిసి క్రిస్ మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఫోటోను ధోని సతీమణి సాక్షి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అన్ని ఫార్మెట్లలో రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా కొనసాగుతున్నాడు. గత రెండేళ్లలో టెస్ట్ క్రికెట్ లో భారతదేశం తరపున అత్యత్తమ ప్రదర్శనను నిర్వహించిన వారిలో పంత్ ఒకడు.2020-21 లో అస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సీరీస్ లలో ఇండియా విజయంలో రిషబ్ పంత్ కీలకపాత్ర పోషించారు.
రిషబ్ పంత్ కాలికి ఎలాంటి గాయాలు లేవని వైద్యులు ప్రకటించారు. రిషబ్ పంత్ కు ఎక్స్ రే తీసిన తర్వాత వైద్యులు పంత్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. పంత్ శరీరంపై కాలిన గాయాలు లేవని వైద్యులు చెప్పారు. నుదురు, మోకాలిపై మాత్రమే గాయాలున్నాయని వైద్యులు చెప్పారు. వీపు భాగంలోనే గాయాలున్నట్టుగా వైద్యులు గుర్తించారు.