Republic Day: గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన
Republic Day celebrations: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా.. గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. జనవరి 29న జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో భాగంగా మొట్టమొదటిసారిగా 1,000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు.
Republic Day celebrations: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా.. గణతంత్ర వేడుకలల్లో 1000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. జనవరి 29న జరిగే బీటింగ్ ది రిట్రీట్ వేడుకలో భాగంగా మొట్టమొదటిసారిగా 1,000 డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఐఐటీ ఢిల్లీ స్టార్టప్ అయిన ‘బోట్ల్యాబ్ డైనమిక్స్’ అనే అంకుర సంస్థ దీన్ని నిర్వహించనుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు గతంలో ఈ స్థాయిలో డ్రోన్లను ఉపయోగించి ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించాయి. దీనికితోడు తొలిసారి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ గోడలపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బీటింగ్ రీట్రీట్లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్ షో ఉండటం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు.
డ్రోన్లతో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి. ఇప్పుడు ఆ జాబితాలో భారత్ కు చేరబోతున్నది. కాగా, బీటింగ్ ది రిట్రీట్ వేడుక అనేది శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయం. దీనిని ప్రతి సంవత్సరం జనవరి 29న న్యూఢిల్లీలోని విజయ్ చౌక్లో నిర్వహిస్తుంటారు. కాగా, దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 23 న ప్రారంభమై జనవరి 30 వరకు జరుగుతాయి. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేపథ్యంలో ప్రభుత్వం 23 నుంచే గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం, ఫ్లై-పాస్ట్లో పాల్గొనే విమానాల దృశ్యమానతను నిర్ధారించడానికి జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ అరగంట ఆలస్యమవుతుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. డెబ్బై-ఐదు విమానాలు ఫ్లై-పాస్ట్లో భాగంగా ఉంటాయి. కోవిడ్ ప్రోటోకాల్ను దృష్టిలో ఉంచుకుని, రిపబ్లిక్ డే పరేడ్లో సందర్శకుల సంఖ్య 5,000-8,000కి తగ్గించబడింది. గత ఏడాది దాదాపు 25,000 మంది కవాతుకు హాజరయ్యారు.
ఇదిలావుండగా, ఈ సారి గణంత్ర వేడుకల పరేడ్ లో పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన శకటాలు ప్రదర్శనకు అనుమతి లభించింది. ఎంపికైన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కర్నాటక, మేఘాలయ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లు ఉన్నాయి. గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై ఈసారి రాజకీయ దుమారం చెలరేగింది. తమ శకటాలను ప్రదర్శించాలని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించింది.
కాగా, గణతంత్ర దినోత్సవాలు సమీపించిన తరుణంలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ(MHA) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఓ అడ్వైజరీ పంపింది. ఫ్లాగ్ కోడ్(Flag Code)ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. జాతీయ పతాకం.. మన దేశ ప్రజల ఆశలు, ఆశయాలకు ప్రతీక అని, కాబట్టి.. త్రివర్ణ పతాకానికి ఉన్నతమైన గౌరవం ఉంటుందని ఆ అడ్వైజరీలో కేంద్రం పేర్కొంది. భారత పతాక కోడ్ ప్రకారం, ముఖ్యమైన జాతీయ వేడుకలు, సాంస్కృతిక, క్రీడాపరమైన వేడుకల్లో జాతీయ జెండాలను ఉపయోగిస్తారని వివరించింది. అయితే, ఆ కార్యక్రమాల్లో పేపర్ ఫ్లాగ్స్నూ విరివిగా వినియోగిస్తారని తెలిపింది. ప్రజలు ఎక్కువగా వీటిని చేత పట్టుకుని కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొంది. అయితే, కార్యక్రమం ముగిసిన తర్వాత వారు ఆ జెండాను అక్కడే నేలపై పడేసి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.