మోడీ బర్త్ డే గిఫ్ట్: రికార్డులు బ్రేక్.. సింగిల్ డేలో రెండు కోట్ల డోసుల పంపిణీ
ఈ రోజు దేశవ్యాప్తంగా రికార్డు బద్ధలు కొడుతూ టీకా పంపిణీ జరిగింది. ఇవాళ సాయంత్రానికల్లా రెండు కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ రికార్డు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజున కేంద్ర ప్రభుత్వం రికార్డులు బ్రేక్ చేస్తూ టీకా పంపిణీ చేసింది. ఇవాళ ఒక్కరోజే సాయంత్రానికల్లా రెండు కోట్ల డోసులకు పైగా టీకాలను పంపిణీ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. నిమిషానికి 42 వేల డోసులు, సెకన్కు 700 డోసుల పంపిణీతో ఈ రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనూహ్య వేగంతో జరిగింది. మధ్యాహ్నం 1.30 గంటలకే కోటి డోసుల పంపిణీ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా వెల్లడించారు. ఈ రోజు సరికొత్త రికార్డు నమోదవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇదే జన్మదిన కానుకగా నిలుస్తుందని వివరించారు. ఈ వివరాలను ట్వీట్ చేస్తూ వ్యాక్సిన్ సేవా, హ్యాపీ బీడే మోడీజీ హ్యాష్ట్యాగ్లను పేర్కొన్నారు.
ఈ రోజు ప్రత్యేకంగా కొవిన్ పోర్టల్లో రియల్ టైంలో టీకా పంపిణీ వివరాలను వెల్లడయ్యే ఓ టిక్కర్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా రియల్ టైంలో దేశవ్యాప్తంగా ఎన్ని టీకాల పంపిణీ పూర్తయిందో తెలుస్తుందని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిమిషానికి 42వేలు లేదా సెకన్కు 700 టీకాల వేగంతో పంపిణీ సాగుతున్నదని మధ్యాహ్నం ఆయన ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో అర్హులైనవారందరికీ కనీసం ఒక టీకా అందించడమే తమ ప్రథమ ప్రాధాన్యమని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం. దీన్ని పురస్కరించుకుని బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం టీకా పంపిణీపై కాన్సంట్రేట్ చేసింది. ఈ రోజును చరిత్రపుటల్లోకి ఎక్కించడమే లక్ష్యమని ఓ సీనియర్ బీజేపీ నేత తెలిపారు.