సీఏఏ ఆందోళనలు... నష్ట పరిహారంగా రూ.6లక్షలు
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం( సీఏఏ)ని పలు చోట్ల ఆందోళనలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు కారణంగా... పలు ప్రాంతాల్లో తీవ్ర ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. అయితే... ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఆస్తి నష్టాన్ని పూడ్చేందుకు ముస్లింల వర్గం ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆరు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిందని తెలిపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే...కేంద్ర ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. యూపీలో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి. దీంతో ఆగ్రహించిన యోగి సర్కారు.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కారణమైన వారిని గుర్తించి.. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలోని బులంద్షహర్లో గత శుక్రవారం చెలరేగిన అల్లర్లలో జరిగిన నష్టానికి చింతిస్తూ ముస్లిం సోదరులు పరిహారం చెల్లించారు. ఈ మేరకు రూ. 6.27 లక్షల చెక్కును ప్రభుత్వ అధికారులకు అందజేశారు. ఈ విషయం గురించి బులంద్షహర్ కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం నమాజ్ పూర్తైన తర్వాత కొంత మంది ముస్లిం వ్యక్తులు తనను కలిసి డీడీ ఇచ్చారని తెలిపారు.
అదే విధంగా ప్రభుత్వ వాహనం ధ్వంసమైనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. హింసను వ్యతిరేకిస్తూ లేఖ కూడా అందించారని పేర్కొన్నారు. రికవరీకి వెళ్లకముందే స్వయంగా వారే పరిహారం చెల్లించడం గొప్ప విషయమని ప్రశంసించారు. కాగా సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో చెలరేగిన హింస కారణంగాగా ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు.. రూ .14.86 లక్షలు కట్టాలంటూ యూపీ సర్కారు 28 మందికి నోటీసులు పంపిన విషయం తెలిసిందే.