Agnipath: అగ్నివీరులకు పెన్షన్ ఇవ్వకుంటే.. నా పెన్షన్ వదులుకుంటా: కేంద్రంపై బీజేపీ ఎంపీ దాడి
అగ్నిపథ్ స్కీం ద్వారా ఆర్మీలో నాలుగేళ్లు పని చేసి బయటకు వచ్చే అగ్నివీరులకు పెన్షన్ లేనప్పుడు ఐదేళ్లు పదవిలో ఉండి దిగిపోయే ప్రజా ప్రతినిధులకు ఎందుకు పెన్షన్ ఉండాలని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను తన పెన్షన్ వదులుకోవడానికి సిద్ధం అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. భద్రతా బలగాల్లోకి నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం అగ్నిపథ్ స్కీంను ఆయన ప్రశ్నించారు. ఈ స్కీం ద్వారా ఆర్మీలోకి వెళ్లిన యువత నాలుగేళ్లు సర్వీసు చేసి రిటైర్ కావాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్ల ప్రభుత్వ స్కీంలో అగ్నివీరులకు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని ఆయన అడిగారు.
వరుణ్ గాంధీ తన ట్విట్టర్లో హ్యాండిల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. నాలుగేళ్లు సైన్యంలో సేవలు అందించి వచ్చే అగ్నివీరులకు పెన్షన్ అవకాశం లేనప్పుడు ఐదేళ్లు పదవిలో ఉండి దిగిపోయే ప్రజా ప్రతినిధులకు ఆ సదుపాయం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. దేశాన్ని రక్షించే సైనికులే పెన్షన్కు నోచుకోకుంటే.. తాను తన పెన్షన్ను వదులుకోవడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. అగ్నివీరులు వారి వారి పెన్షన్ పొందటం కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం పెన్షన్లు వదులుకుందామా? అని అడిగారు.
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న అగ్నిపథ్ స్కీంను ప్రకటించింది. భారత యువత సైన్యంలో చేర్చుకోవడానికి కొత్తగా ఈ స్కీంను ముందుకు తెచ్చింది. అయితే. ఈ స్కీం ద్వారా రిక్రూట్ అయిన యువత సైన్యంలో కేవలం నాలుగేళ్లు మాత్రమే సేవలు అందిస్తారు. ఆ తర్వాత దాదాపు 75 శాతం మళ్లీ వెనుదిరిగి రావాల్సి ఉంటుంది. ఆ నాలుగేళ్లు సైన్యంలో చేసి వెనక్కి వచ్చేవారికీ ఎలాంటి పెన్షన్ ఉండదు. ఈ విషయమై వరుణ్ గాంధీ తాజాగా ఫైర్ అయ్యారు.