పోలీస్ స్టేషన్ లోపలే విషం తాగిన అత్యాచార బాధితురాలు.. ఎందుకంటే..
తన మీద ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించడానికి వచ్చిన ఓ 17 ఏళ్ల బాలిక, ఏడీజీపీ కార్యాలయంలో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
ఉత్తరప్రదేశ్ : అత్యాచార బాధితురాలైన మైనర్ బాలిక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. ఉత్తరప్రదేశ్ లో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనమీద ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె చేసిన ఆరోపణలు అబద్దం అని ఇన్స్పెక్టర్ అనడంతో మనస్తాపంతో ఆ బాలిక డీజీపీ ఆఫీసులోనే విషం తాగింది. ఇది గమనించిన వారు వెంటనే హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వారు తెలిపారు.
సోమవారం ఈ ఘటన జరిగింది. దీనిమీద బాలిక సోదరి తెలిపిన వివరాల ప్రకారం... బాధితురాలి మీద అత్యాచార ఘటన విషయంపై చర్య తీసుకోవాలని కోరుతూ వారు బరేలీ జోన్, ఏడీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారు తమ గోడు వెళ్లబోసుకున్నప్పుడు.. అక్కడున్న ఒక ఇన్స్పెక్టర్ అది తప్పుడు కేసు అని పేర్కొన్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె విషపూరితమైన పదార్థాన్ని సేవించిందని ఆమె సోదరి పేర్కొంది.
డాక్టర్ దంపతుల కుమార్తెపై లైంగికదాడి.. హుక్కా బార్లో రేప్ చేసిన ఇన్స్టా ఫ్రెండ్
పోలీస్ సూపరింటెండెంట్ (నగరం) రాహుల్ భాటి మాట్లాడుతూ, బాలిక తన దరఖాస్తుపై చర్య తీసుకోవాలని కోరుతూ ఏడీజీపీ కార్యాలయానికి వచ్చిందని, అక్కడే విషం సేవించిందని తెలిపారు. పిలిభిత్ నివాసి అయిన 17 ఏళ్ల బాధితురాలు తన సోదరితో కలిసి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఆరు నెలల క్రితం ఆమె మీద వారి పొరుగింటి వ్యక్తి, అతని స్నేహితుడితో కలిసి అత్యాచారం చేశాడని బాలిక సోదరి ఆరోపించింది. ఈ విషయమై సుంగరి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో వారు నేరుగా ఏడీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నం ఘటన జరిగిన సమయంలో ఏడీజీ పీసీ మీనా తన కార్యాలయంలో లేరని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉండగా, నాలుగు రోజుల క్రితం ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని ఏపీలోని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. సదరు మహిళా స్నానం చేస్తుండగా నిందితుడు దొంగచాటుగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత వాటిని చూపిస్తూ ఆమె మీద బెదిరింపులకు పాల్పడ్డాడు. తను చెప్పినట్టుగా వినకపోతే ఫోటోలను వైరల్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేశాడు. ఆ తర్వాత ఆమె మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నగ్న ఫోటోలను అడ్డుపెట్టుకుని ఆమె దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకున్నాడు. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె అడిగింది. దీంతో ఆమె మీద దాడికి దిగాడు.
రోజురోజుకు అతని వేధింపులు ఎక్కువ అవుతుండడంతో తన కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు విజయవాడ నగరం నున్న పోలీసులు నిందితుడి మీద కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సిఐ కాగిత శ్రీనివాసరావు ఈ మేరకు వివరాలు తెలిపారు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాలాంధ్ర కాలనీకి చెందిన పుట్ట సుభాష్ (45) నిందితుడు. అతను బిపిసిఎల్ కంపెనీలో పైప్ లైన్ సెట్టింగ్ చేసే పనులు చేస్తుంటాడు.
విజయవాడ రాజీవ్ నగర్ కు చెందిన ఓ మహిళ (35).. భర్తతో కలిసి కిరాణం దుకాణం నడుపుతుంది. ఇటీవలి కాలంలో నగదు లావాదేవీలన్నీ ఫోన్ పే, పేటీఎంల ద్వారానే జరుగుతున్న క్రమంలో.. నిందితుడు సుభాష్ తరచుగా ఆ దుకాణంలో సరుకులు కొనుగోలు చేసేవాడు. ఆ సమయంలో డబ్బులు కట్టడం కోసం ఫోన్ పే, పేటీఎంలు వాడుతూ.. ఆ మహిళ ఫోన్ నెంబర్ను ఎలాగో సంపాదించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఒకసారి ఆమె రాజీవ్ నగర్ లోని తన ఇంట్లో స్నానం చేస్తుండగా.. అతను దొంగ చాటుగా ఫోటోలు తీశాడు. ఆ తర్వాత అవి చూపిస్తూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.