రాంచీ-పూణె ఇండిగో విమానం నాగ్ పూర్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికుడి మృతి..
పూణే వెళ్లే ఇండిగో విమానం నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ, తరువాత అతను మరణించాడు.
నాగ్ పూర్ : రాంచీ నుంచి పూణెకు వెడుతున్న ఇండిగో విమానం నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడుకి మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందని శుక్రవారం విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. గురువారం రాత్రి సుమారు 10 గం.ల సమయంలో ఫ్లైట్ 6E 672 లో ఈ ఎమర్జెన్సీ ఏర్పడింది. దీంతో నాగ్పూర్ విమానాశ్రయానికి మళ్లించబడిందని, అక్కడ అత్యవసర ల్యాండింగ్ తరువాత.. ఆ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ అతను చనిపోయినట్లు నిర్ధారించారని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితిని స్పష్టంగా వివరిస్తూ... ప్రయాణీకుడికి వైద్య సహాయం అందించామని, అయితే అతని ప్రాణాలను కాపాడలేకపోయామని భారత క్యారియర్ ఒక ప్రకటన ఇచ్చింది. "ఫ్లైట్లో ప్రయాణికుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే వైద్య సహాయం కోసం విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి, ఆసుపత్రికి తరలించాం. కానీ దురదృష్టవశాత్తు అతను బతకలేదు’’ అని ఎయిర్లైన్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇటీవల విమాన ప్రయాణీకులు.. ప్రయాణ సమయంలో మరణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో, మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీ-దోహా ఇండిగో విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ప్రయాణీకుడికి విమానాశ్రయంలో వైద్య సహాయం అందించారు, ఆ తరువాత అతను చనిపోయినట్లు ప్రకటించారు. దీని తరువాత, విమానాన్ని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు 5 గంటలపాటు నిలిపి ఉంచారు, ఆపై తిరిగి ఢిల్లీకి టేకాఫ్కు అనుమతించారు.
వార్నీ.. నిత్యానంద వలలో అమెరికా నగరాలు.. "సిస్టర్ సిటీ" స్కామ్తో కుచ్చుటోపీ.. వెలుగులోకి రావడంతో...
విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణీకుడు అస్వస్థతకు గురయ్యాడు. కెప్టెన్ కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసిందిగా అభ్యర్థించాడని ఆ నగరంలోని సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు తెలిపారు.
అంతకు ముందు కూడా, మదురై-ఢిల్లీ ఇండిగో విమానం ఇండోర్లోని దేవి అహల్యాబాయి హోల్కర్ విమానాశ్రయంలో 60 ఏళ్ల ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయబడింది. ల్యాండింగ్ తర్వాత, ప్రయాణీకుడిని వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించగా, వైద్య సిబ్బంది మరణించినట్లు ప్రకటించారు. ప్రయాణికుడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడని, అది అతని మరణానికి దారితీసిందని తెలిసింది.
ఇదిలా ఉండగా, మార్చి 13న మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఢిల్లీ నుంచి దోహా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని పాకిస్థాన్లోని కరాచీకి మళ్లించారు. అస్వస్థతకు గురైన ఒక ప్రయాణీకుడు విమానం ల్యాండింగ్ సమయంలో మరణించినట్లు విమానాశ్రయ వైద్య బృందం ప్రకటించిందని ఎయిర్లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రయాణికుడు నైజీరియా దేశస్థుడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
"ఈ వార్త మమ్మల్ని చాలా బాధపెట్టింది. అతని కుటుంబానికి, సన్నిహితులకు మా సానుభూతి. మా సహాయం ఎప్పటికీ వారికి ఉంటుంది. ప్రస్తుతం సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను వారి గమ్యస్థానానికి చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాం" అని ఇండిగో తెలిపింది. ఈ విమానం త్వరలో కరాచీ నుంచి బయలుదేరుతుందని భావిస్తున్నారు.