ఘోర రోడ్డు ప్రమాదం: పికప్ వ్యాన్ బోల్తా.. ఏడుగురు కూలీలు మృతి.. 8 మందికి తీవ్రగాయాలు
Ranchi: జార్ఖండ్లోని సరైకేలా-ఖర్సవాన్ జిల్లాలో గురువారం ఉదయం 30 మంది కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Jharkhand Raoad Accident: గురువారం తెల్లవారుజామున జార్ఖండ్లోని సరైకేలా-ఖర్సావాన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలు ప్రయాణిస్తున్న ఒక పికప్ వ్యాన్ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
రాజ్నగర్-చైబాసా రహదారిపై 30 మంది కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ ఖైర్బాని గ్రామ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహిళలు సహా ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, డజను మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజ్నగర్ కమ్యూనిటీ సెంటర్కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే రాజ్నగర్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, దాదాపు 30 మంది కార్మికులతో వేగంగా వచ్చిన వ్యాన్ చైబాసా నుండి జంషెడ్పూర్ వైపు వెళుతుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ క్రమంలోనే వాహనం బోల్తా కొట్టింది. గాయపడిన వారందరినీ మొదట రాజ్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. అయితే, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జంషెడ్ పూర్ కు రిఫర్ చేశారు.
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 'సెరైకెలా-ఖర్సవాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం చాలా బాధాకరం. ప్రమాదంలో గాయపడిన ఇతరులు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు" అని సోరెన్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో తెలిపారు. మరణించిన వారి ఆత్మలకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
కాగా, గత ఏడాది (2021)తో పోలిస్తే 2022లో జార్ఖండ్ లో రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. రవాణా శాఖ గణాంకాల ప్రకారం 2021 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4728 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 3513 మంది మరణించారు. 3227 మంది గాయపడ్డారు. అదే సమయంలో, 2022 సంవత్సరంలో 5067 రోడ్డు ప్రమాదాల్లో 3703 మంది మరణించారు. 3678 మంది గాయపడ్డారు. మరణాలకు అత్యధిక కారణం అతివేగం అని నివేదించబడింది. మరణాల గణాంకాలను పరిశీలిస్తే, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో 41 శాతం మంది మరణించారు.
18 ఏళ్లలోపు వారిలో ఏడు శాతం మంది చనిపోయారు. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్కుల్లో 18 శాతం, 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కుల్లో 23 శాతం, 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కుల్లో 18 శాతం, 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 12 శాతం మంది, 60 ఏళ్లు పైబడిన వారిలో 4 శాతం మంది మరణించారు.