జెపీ నడ్డా జట్టు: మురళీధర్ రావు, రాంమాధవ్ లకు దొరకని చోటు
మొన్నటివరకు బీజేపీలో చక్రం తిప్పిన అపర చాణక్యులు నూతన కార్యవర్గంలో కనబడకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నూతన బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇందులో అనూహ్యంగా కొందరు సీనియర్ల పేర్లు కనబడకపోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొన్నటివరకు బీజేపీలో చక్రం తిప్పిన అపర చాణక్యులు నూతన కార్యవర్గంలో కనబడకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
బీజేపీ నూతన కార్యవర్గంలో రామ్ మాధవ్, మురళీధర్ రావు ల పేర్లు కార్యదర్శుల జాబితాలో లేకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈశాన్య భారతంలో కాషాయ జెండా ఎగరడానికి ప్రముఖ కారకుడైన రామ్ మాధవ్ పేరు ఈ జాబితాలో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు కూడా అధికార ప్రతినిధుల జాబితాలో లేదు.
బీజేపీ నూతన కార్యవర్గం నియమింపబడ్డ తరువాత ట్విట్టర్ వేదికగా నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు రామ్ మాధవ్. అంతే కాకుండా తనకు ఒకసారి ప్రధాన కార్యదర్శిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక కొత్తగా ఎంపీ గా ఎన్నికైన తేజస్వి సూర్యను బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమించగా, మహిళా మోర్ఛాకు ఎవరిని నియమించలేదు. తెలంగాణకు చెందిన లక్ష్మణ్ ని జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు.
పార్టీ ఉపాధ్యక్షులు జాబితాలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, కొత్తగా బీజేపీలో చేరిన డీకే అరుణకు చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పురంధేశ్వరిని జాతీయ కార్యదర్శిగా నియమించారు. మొత్తానికి జెడ్పీ నడ్డా కొత్త టీం లో పాతవారిని కొందరిని కొనసాగిస్తే.... మరికొందరు కొత్త మొక్కలకు అవకాశం దక్కింది.