సారాంశం
జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో కశ్మీరీ పండిట్లు, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరి శరణార్థులకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను లోక్ సభ డిసెంబర్ 6వ తేదీన ఆమోదం తెలుపగా.. తాజాగా రాజ్యసభ వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎప్పటికైనా భారత్దేనని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంటులో మరో సంచలనం చోటుచేసుకుంది. జమ్ము కశ్మీర శాసన సభ స్థానాల్లో కశ్మీరీ పండిట్లు, పాక్ ఆక్రమిత కశ్మీర్ శరణార్థులకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో 24 స్థానాలు రిజర్వ్ చేశామని అమిత్ షా అన్నారు. ఇక్కడ ఎవరు ఏమనుకున్నా.. పీవోకే మనదే అని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఎవరూ మన నుంచి లాక్కోలేరూ అని చెప్పారు.
కశ్మీరీ పండిట్లు, పీవోకే శరణార్థులకు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ స్థానాల రిజర్వేషన్లు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు బిల్లులు జమ్ము కశ్మీర్ రిజర్వేషన్(సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు 2023లను ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులను డిసెంబర్ 6వ తేదీన లోక్ సభ ఆమోదించింది. తాజాగా, రాజ్యసభలోనూ ఆమోదం లభించింది.
ఈ సందర్భంగా అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ.. ‘జమ్ములో 37 సీట్లు ఉండేవి.. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇవి 43 సీట్లకు పెరిగాయి. గతంలో కశ్మీర్లో 46 అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇపపుడు అవి 47కు పెరుగుతాయి’ అని వివరించారు.
Also Read: Madhya Pradesh CM: ఎవరీ మోహన్ యాదవ్? మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తో లింక్ ఏమిటీ?
ఈ రెండు బిల్లుల్లో ఒకటి జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ చట్టం 2024ను సవరణ చేయడానికి ప్రవేశపెట్టారు. ఈ చట్టం విద్యారంగాల్లో ఎస్సీలు, ఎస్టీలు, ఇతర సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేది. మరో బిల్లు జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019ను సవరిస్తుంది.
ఈ బిల్లులు మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచుతాయి. అలాగే.. ఎస్సీలకు ఏడు సీట్లు, ఎస్టీలకు తొమ్మిది సీట్లను రిజర్వ్ చేస్తాయి.
ఒక మహిళా కశ్మీరీ శరణార్థి, మరో పీవోకే శరణార్థిలను జమ్ము కశ్మీర్ అసెంబ్లీకి నామినేట్ చేయడానికి జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019లో కొత్తగా 15ఏ, 15బీలను జోడించాల్సి వస్తున్నది.