రాజీవ్ గాంధీ హత్య: నళిని పెరోల్పై జైలు నుండి విడుదల
దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని గురువారం నాడు పెరోల్ పై విడుదల అయ్యారు. కూతురు పెళ్లి కోసం ఆమె పెరోల్ కోసం ధరఖాస్తు చేసుకొన్నారు.
చెన్నై: మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న నళిని గురువారం నాడు పెరోల్పై వెల్లూరు జైలు నుండి విడుదల య్యారు.
తన కూతురు వివాహం కోసం నళిని పెరోల్ కోరారు.పెరోల్కు కోర్టు అంగీకరించడంతో గురువారం నాడు ఉదయం నళినిని విడుదల చేశారు. నళిని కూతురు హరిత పెళ్లి కోసం ఆరు మాసాల పాటు పెరోల్ కోరింది. అయితే కేవలం నెల రోజుల పాటు మాత్రమే కోర్టు ఆమెకు పెరోల్ కల్పించింది.
వెల్లూరు కోర్టు వద్ద నళిని తల్లితో పాటు ఆమె కూతురు హరితలు ఆమెను రిసీవ్ చేసుకొన్నారు. నళిని కూతురు మెడిసిన్ చదివేందుకు పెళ్లి తర్వాత యూకేకు వెళ్లనున్నారు.
నళిని వెల్లూరు విడిచి వెళ్లకూడదని కోర్టు షరతులు పెట్టింది .తల్లిగా తన కూతురు కోసం ఎలాంటి బాధ్యతలను నెరవేర్చని విషయాన్ని పెరోల్ కోసం ధరఖాస్తు చేసిన సమయంలో నళిని కోర్టులో ప్రస్తావించారు. పెరోల్ సమయంలో పోలీసుల రవాణా ఖర్చును కూడ కోర్టు మినహాయించింది.
అయితే గత ఏడాది తన తండ్రి మరణించిన సమయంలో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తనకు రక్షణగా వచ్చిన పోలీసులకు నళిని రూ. 16 వేలను చెల్లించింది.ఈ విషయాన్ని నళిని కోర్టుకు తెలిపింది.