క్రైమ్ న్యూస్: మేకను విక్రయించారనే కోపంతో తల్లిని చంపాడు ఓ బాలుడు. సాయంత్రం పనిముగించుకుని ఇంటికి వచ్చిన తండ్రి.. ఆమె గురించి అడగ్గా, పొలం దగ్గరకు వెళ్లిందని చెప్పాడు.
రాజస్థాన్: క్షణికావేశంలో ఏం చేస్తున్నారో తెలియకుండా క్రూరమైన దారుణాలకు ఒడికడుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మేకను అమ్మారనే విషయంలో కోపంతో తన తల్లిపై పదునైన ఆయుధంతో దాడి చేసి ప్రాణాలు తీశాడు ఓ బాలుడు. మృతదేహాన్ని ఇంట్లో ఉన్న ఒక డబ్బాలో దాచిపెట్టాడు. ఈ దారుణ షాకింగ్ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
ఈ దారుణ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మేకను విక్రయించారనే విషయంలో కోపంతో రాజస్థాన్లోని ఝలావర్ జిల్లాలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి తన తల్లి ప్రాణాలు తీశాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఇంట్లో ఉన్న టిన్ బాక్స్లో దాచిపెట్టాడని పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం ఝలావర్లోని సునేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెమ్లియా గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలిని బలరాం భార్య నోడయన్బాయి మేఘవాల్ (40)గా గుర్తించారు. ఆ బాలుడు తన 40 ఏళ్ల తల్లిపై పదునైన వస్తువుతో దాడి చేశాడని, దీంతో తలపైనా, శరీరంపైనా లోతైన గాయాలయ్యాయని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) దినేష్ కుమార్ శర్మ తెలిపారు. ఆ తర్వాత బాలుడు మృతదేహాన్ని దుప్పటిలో కప్పి తన ఇంట్లోని డబ్బాలో దాచిపెట్టాడని వెల్లడించారు. బాలుడి తండ్రి సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే తన భార్య కనిపించకపోవడంతో.. ఆమె గురించి అడిగాడు. ఆమె పొలాలకు వెళ్లిందని బాలుడు సమాధానమిచ్చాడు.
అయితే, ఆమె పొలం దగ్గర కూడా లేకపోవడంతో.. బాధితురాలి ఇరుగుపొరుగు వారిని ఆమె ఆచూకి గురించి అడిగారు. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు స్థానికంగా ఇళ్లలో సోదాలు చేశారు. అయితే, బాలుడిని తండ్రి గట్టిగా అడిగితే తానే ఆమె చంపినట్లు అంగీకరించాడని ఎస్హెచ్ఓ తెలిపారు. పోలీసులు టిన్ బాక్స్ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అక్కడ మృతదేహానినకి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని అప్పగించినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నామని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, బాలుడి వయస్సు ఇంకా నిర్ధారించాల్సి ఉందన్నారు.
ఇదిలావుండగా, రాజస్థాన్లో దుండగుల రెచ్చిపోయారు. బుండి జిల్లాలోని నైన్వా పట్టణంలో గుర్తుతెలియని దొంగలు కాలుపు పెట్టుకున్న కడియాలను దొంగిలించేందుకు 80 ఏళ్ల వృద్ధురాలి కాలు నరికేశారు. వెండి కడియాలను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తస్రావంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు... ప్రాణాల కోసం పోరాడుతోంది. ఈ ఘటన మానవత్వాన్ని కలచివేసింది. 80 ఏళ్ల ఉచ్బీ బాయి రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉందని సీఐ బాబూలాల్ మీనా తెలిపారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. ఆమె అరవకుండా నోటిని మూశారు. ఆమె వద్ద ఉన్న అభరణాలు దొంగిలించారు. ఈ క్రమంలోనే ఆమె కాలుకు పెట్టుకున్న కడియాలు తీయడానికి రాకపోవడంతో.. ఆమె కాలు నరికారు.
