అగ్నిపథ్ పథకంపై ఇంకా వేడి చల్లారలేదు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విద్యార్ధులు, నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజస్థాన్ మంత్రి రామ్ లాల్ అగ్నిపథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై (agnipath scheme) దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ కేంద్రం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అటు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలు కూడా (army recruitment rally) మొదలైపోయాయి. ఈ క్రమంలో రాజస్థాన్ (rajasthan) రెవెన్యూ శాఖ మంత్రి రామ్ లాల్ జట్ (ramlal jat0 అగ్నిపథ్ పథకంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో పనిచేసి నాలుగేళ్ల తర్వాత బయటకు రావడం అంటే అగ్నిపథ్ దేశాన్ని సుశిక్షత ఉగ్రవాదం దిశగా నడిపిస్తుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏడాది పాటు పనిచేసినా పెన్షన్ ఇస్తున్నారని.. మరి అగ్నివీర్లకు మాత్రం పెన్షన్ ఇవ్వరా అని రామ్ లాల్ ప్రశ్నించారు. నాలుగేళ్ల తర్వాత నిరుద్యోగులుగా మారుతుండటంపై యువత ఆందోళనగా వుందని.. కేంద్ర దీనిపై ఆలోచించాలని సూచించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరోవైపు అగ్నిపథ్‌పై ఆందోళనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది. కేంద్రం అగ్నిపథ్ స్కీం ప్రకటించిన 10 రోజులకు భారత వైమానిక దళం అగ్నిపథ్ స్కీం కింద రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఈ నోటిఫికేషన్‌కు పెద్దగా ఆదరణ ఉండబోదనే వాదనలు వచ్చాయి. కానీ, ఈ నోటిఫికేషన్‌కు వచ్చిన దరఖాస్తులు చూస్తే మాత్రం ఆ అంచనాలు తప్పు అని తేలిపోతుంది. అగ్నిపథ్ స్కీం కింద భారత వైమానిక దళానికి సుమారు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు భారత వైమానిక దళానికి వచ్చిన అత్యధిక అప్లికేషన్లు ఇవే కావడం గమనార్హం. ఈ మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఓ ట్వీట్ చేసింది. 

ALso Read:అగ్నిపథ్ స్కీంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను వచ్చే వారం విచారించనున్న సుప్రీంకోర్టు

అగ్నిపథ్ స్కీం కింద ఐఏఎఫ్‌లో రిక్రూట్‌మెంట్ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తుల గడువు ముగిసిందని ఆ ట్వీట్ పేర్కొంది. గతంలో భారత వైమానిక దళంలో ఉద్యోగ నోటిఫికేషన్‌కు గరిష్టంగా 6,31,528 అప్లికేషన్లు వచ్చాయని వివరించింది. కానీ, అగ్నిపథ్ స్కీం కింద మరే సైకిల్‌లోనూ రాలేనన్ని దరఖాస్తులు వచ్చాయని, ఐఏఎఫ్ చరిత్రలోనే అత్యధికంగా 7,49,899 అప్లికేషన్లు వచ్చాయని వివరించింది. అగ్నిపథ్ స్కీం కింద ఐఏఎఫ్ జూన్ 24వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారంతో ఈ నోటిఫికేషన్‌కు ఉద్యోగ దరఖాస్తు గడువు ముగిసింది.