నుపూర్ శర్మకు మద్దతు.. దుకాణదారుడి తల నరికి చంపిన దుండగులు
Rajasthan: నుపూర్ శర్మకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఒక వర్గం దుకాణదారుడిని తల నరికి చంపారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఖండించారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Rajasthan: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన ఓ దుకాణదారుడిని క్రూరంగా తల నరికి హత్య చేశారు. ఈ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్లోని ఉదయపూర్లో సస్పెండ్ చేయబడిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులు ఒక వర్గానికి చెందిన దుకాణదారుని తల నరికి చంపారు. ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఇద్దరు నిందితులు హత్యాయుధాలతో కనిపించడంతోపాటు నేరాన్ని అంగీకరించడం సంచలనంగా మారింది. నిందితులు ప్రధాని నరేంద్ర మోడీని కూడా చంపేస్తామని బెదిరించారు.
భారతీయ జనతా పార్టీ నాయకురాలు నుపూర్ శర్మకు మద్దతుగా దుకాణదారుడి ఎనిమిదేళ్ల కుమారుడు పెట్టిన పోస్ట్ను అనుసరించి హత్య జరిగినట్లు ఇండియా టుడే నివేదించింది. నుపూర్ శర్మ ఇటీవల ప్రవక్త ముహమ్మద్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. మంగళవారం ఉదయపూర్లోని ఓ టైలర్ షాపులోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించి కత్తులతో దాడికి దిగుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇద్దరు వ్యక్తులు పోస్ట్ చేసిన ప్రత్యేక వీడియోలో ఇద్దరూ హత్య చేసినట్లు అంగీకరించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బెదిరించడం ఆ దృశ్యాల్లో కనిపించింది.
ఈ దారుణానికి ఒడికట్టిన హంతకులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఉదయపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మాట్లాడుతూ.. "ఒక దారుణ హత్య జరిగింది.. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతాము. కొంతమంది నిందితులను గుర్తించారు. నిందితులను గుర్తించడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.
కాగా, ఈ హత్య రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతకు కారణమైంది. ఈ క్రమంలోనే శాంతియుతంగా ఉండాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రజలను కోరారు. "ఉదయ్పూర్లో యువకుడి దారుణ హత్యను నేను ఖండిస్తున్నాను. ఈ ఘటనలో పాల్గొన్న నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటాము. దీనిపై పోలసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతారు. శాంతిని కాపాడాలని నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని గెహ్లాట్ ట్వీట్ చేశారు.
"ఇది విచారకరమైన & అవమానకరమైన సంఘటన. నేడు దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ & అమిత్ షా దేశాన్ని ఉద్దేశించి ఎందుకు మాట్లాడరు? ప్రజల్లో టెన్షన్ నెలకొంది. అటువంటి హింసను సహించబోమని, శాంతి కోసం విజ్ఞప్తి చేయాలని ప్రధాని ప్రజలను ఉద్దేశించి చెప్పాలి" అని ఉదయపూర్ హత్యపై స్పందిస్తూ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.