రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్కి అస్వస్థత: ఢిల్లీ టూర్ రద్దు
అనారోగ్యంతో రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను సీసీయూలో చికిత్స అందిస్తున్నట్టుగా సావాయిమాన్ సింగ్ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. సీఎం గెహ్లాట్ ధమనిలో 90 శాతం అడ్డంకులు గుర్తించినట్టుగా వైద్యులు చెప్పారు.
జైపూర్: అనారోగ్య సమస్యలతో రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ శుక్రవారం నాడు ఆసుపత్రిలో చేరాడు. ఛాతీలో నొప్పి కారణంగా ఇవాళ ఉదయం సావాయిమాన్ సింగ్ ఆసుపత్రిలో చేరాడు.ముఖ్యమంత్రి ప్రస్తుతం సావాయిమాన్ సింగ్ ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఆసుపత్రి కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ సుధర్ బండారి కథనం మేరకు సీఎం ఆశోక్ గెహ్లాట్ సీసీయులో ఉన్నారు. స్కానింగ్ సమయంలో ఆయన ధమనిలో 90 శాతం అడ్డంకులను గుర్తించామన్నారు.
కరోనా నుండి కోలుకొన్న తర్వాత తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా ఆయన చెప్పారు, నిన్నటి నుండి తనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉందన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరినట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఆసుపత్రిలో యాంజియో ప్లాస్టీ చేశారని ఆయన చెప్పారు. ప్రస్తుతం తన ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందన్నారు. త్వరలోనే తిరిగి వస్తానని ఆయ న చెప్పారు.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కలిసేందుకు ఆశోక్ గెహ్లాట్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దైంది. 70 ఏళ్ల ఆశోక్ గెహ్లాట్ రాజస్థాన్ రాష్ట్రానికి మూడో సారి సీఎంగా 2018 డిసెంబర్ మాసంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.