90 అడుగుల బోరుబావిలో పడిన 4 ఏళ్ల బాలుడు: 16 గంటల తర్వాత వెలికితీత
90 అడుగుల లోతులోని బోరుబావిలో పడిన 4 ఏళ్ల బాలుడిని 16 గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీశారు.
జైపూర్: 90 అడుగుల లోతులోని బోరుబావిలో పడిన 4 ఏళ్ల బాలుడిని 16 గంటల తర్వాత సురక్షితంగా బయటకు తీశారు. రాష్ట్రంలోని జలోర్ జిల్లాలోని లాచారీ గ్రామంలో గురువారం నాడు వ్యవసాయక్షేత్రంలో కొత్తగా వేసిన బోరు బావి వద్ద 4 ఏళ్ల అనిల్ అనే బాలుడు ఆడుకొంటూ పడిపోయాడు. గురువారం నాడు ఉదయం 10 గంటలకు అనిల్ బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు సంఘటనస్థలానికి చేరుకొన్నాయి. 16 గంటల పాటు అధికారులు నిరంతరాయంగా శ్రమించి బోరుబావిలో పడిపోయిన బాలుడిని సురక్షితంగా శుక్రవారం నాడు ఉదయం బయటకు తీశారు. బోరు బావి నుండి బయటకు తీసిన తర్వాత ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాలుడికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లోని వడోదర నుండి మూడు టీమ్ లు, ఆజ్మీర్ నుండి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే సమయంలో పైప్లైన్ ద్వారా బాలుడికి ఆక్సిజన్ ను సరఫరా చేశారు. బోరుబావిలో సీసీటీవీని ఏర్పాటు చేసి బాలుడి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించారు.