భారత్ న్యాయ యాత్ర: మణిపూర్ నుండి ముంబై వరకు రాహుల్ రెండో విడత యాత్ర
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేయనున్నారు. గతంలో భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు.ఈ దఫా భారత న్యాయ యాత్ర పేరుతో యాత్రకు రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టనున్నారు.
![Rahul Gandhi to embark upon 'Manipur to Mumbai' Bharat Nyay Yatra from Jan 14 lns Rahul Gandhi to embark upon 'Manipur to Mumbai' Bharat Nyay Yatra from Jan 14 lns](https://static-ai.asianetnews.com/images/01hfva4fswdj601d9sze1y88wt/rahul-gandhi-0-1700649910076_363x203xt.jpg)
న్యూఢిల్లీ:2024 జనవరి 14 నుండి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర నిర్వహించనున్నారు. మణిపూర్ నుండి ముంబై వరకు పాదయాత్ర నిర్వహిస్తారు. 14 రాష్ట్రాల గుండా ఈ యాత్ర సాగనుంది. మార్చి 20వ తేదీ వరకు యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్ర అని పేరు పెట్టారు. సుమారు ఆరువేల రెండు వందల కిలోమీటర్ల దూరం రాహుల్ గాంధీ యాత్ర నిర్వహిస్తారు. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు.
14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా యాత్ర వెళ్లేలా రూట్ మ్యాప్ ను సిద్దం చేస్తున్నారు.మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయా,పశ్చిమ బెంగాల్, బీహార్,జార్ఖండ్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్,చత్తీస్ ఘడ్,రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది.
బస్సు, కాలినడక ద్వారా రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటారు. భారత్ జోడో యాత్రలో పూర్తిగా నడిచారు. అయితే ఎక్కువ మందిని కలిసేందుకు అవకాశం ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రామాల వెలుపల బస్సుల్లో రాహుల్ గాంధీ ప్రయాణం చేస్తారు. గ్రామాల్లో కాలినడకన సాగనున్నారు. గత యాత్రకు భిన్నంగా ఈ యాత్రను రాహుల్ గాంధీ నిర్వహిస్తారు.
భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగింది. దక్షిణాది నుండి ఉత్తరాదికి ఈ యాత్ర సాగింది. భారత్ జోడో యాత్రలో సుమారు 4,500 కి.మీ. పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు.
2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ పాదయాత్రను రాహుల్ గాంధీ నిర్వహించనున్నారు. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఈ దఫా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.దీంతో బస్సు, కాలి నడకన ఎక్కువ దూరం యాత్ర చేయాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు.