షాకింగ్ న్యూస్.. మహాత్మా గాంధీ ఫొటోను డ్యామేజీ చేసిన కేసులో రాహుల్ గాంధీ స్టాఫ్ అరెస్టు
కేరళ నుంచి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతో జరిగిన ఘర్షణల్లో గోడకు ఉన్న మహాత్మా గాంధీ ఫొటో ధ్వంసమైంది. గాంధీ ఫొటోను ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ధ్వంసం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. కానీ, ఈ కేసులో ఇద్దరు రాహుల్ గాంధీ సిబ్బంది, మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ వర్కర్లనే అరెస్టు అయ్యారు.
వయానాడ్: గాంధీల పార్టీగా పేరుపోయిన కాంగ్రెస్.. మహాత్మా గాంధీని ఉన్నతంగా చూస్తుంది. ఆరాధిస్తుంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీ తాత్వికతను చర్చిస్తారు. అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తరచూ జవహర్ లాల్ నెహ్రూ, మహత్మా గాంధీల గురించి చర్చిస్తూనే ఉంటారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ అంతా తలకిందులు చేస్తున్నది. కేరళలో వయానాడ్లోని రాహుల్ గాంధీ కార్యాలయంలో ఇటీవలే జరిగిన ఘర్షణల్లో మహాత్మా గాంధీ ఫొటో ధ్వంసం అయింది. ఈ ఫొటోను ప్రత్యర్థి వర్గం ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు నాశనం చేశారని అభియోగాలు మోపారు. కానీ, వాస్తవాలు ఇందుకు విరుద్ధంగా ఎదురవుతున్నాయి. మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫొటో ధ్వంసం కేసులో రాహుల్ గాంధీ స్టాఫ్ అరెస్టు కావడం చర్చనీయాంశంగా మారింది.
రాహుల్ గాంధీ వయానాడ్ నియోజకవర్గానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వయానాడ్లోని రాహుల్ గాంధీ కార్యాలయం ఇటీవలే ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇందులో ఇద్దరు రాహుల్ గాంధీ స్టాఫ్ అని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. మరో ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలేనని తెలిసింది.
జూన్ 24న ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వయానాడ్లోని రాహుల్ గాంధీ కార్యాలయానికి వెళ్లారు. రాహుల్ గాంధీ కార్యాలయంలోనే రెండు పార్టీ ఎంపీల మధ్య ఘర్షణలు తీవ్రంగా జరిగాయి. ఈ క్రమంలో రాహుల్ ఆఫీసు గోడకు తగిలించిన మహాత్మా గాంధీ ఫొటో ధ్వంసం అయింది.
దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఎప్పుడూ రాహుల్ గాంధీ పార్టీ చేసే అబద్ధపు, అవాస్తవాల మాటల కంటే కూడా ఈ ఘటన చాలా షాకింగ్గా ఉన్నదని ట్వీట్ చేశారు. ఏఎన్ఐ న్యూస్ ఐటమ్ ట్వీట్ను ఆయన పేర్కొంటూ పై విధంగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.